రాధేశ్యామ్ టీమ్ ప్లాన్ ఏంటి?

ఈ రోజు తేదీ జనవరి 4. ఇంకో పది రోజుల్లో ‘రాధేశ్యామ్’ రిలీజ్ కావాల్సి ఉంది. ఐతే ఎక్కడా ప్రమోషన్లు లేవు. విదేశాల్లో బుకింగ్స్ ఓపెన్ చేయలేదు. తెలుగు రాష్ట్రాల్లో, ఇండియాలోని మిగతా చోట్ల సినిమాకు థియేటర్ల బుకింగ్స్ నడుస్తున్న సంకేతాలేమీ కనిపించడం లేదు. రిలీజ్ విషయంలో ముందే ఒప్పందాలు చేసుకున్న బయ్యర్లు కూడా అయోమయంలో ఉన్నారు. ఉత్తరాదిన పరిస్థితులు చూస్తుంటే సినిమాను వాయిదా వేయక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. ఢిల్లీలో థియేటర్లు పూర్తిగా మూత పడ్డాయి.

పలు రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ పెడుతున్నారు. సెకండ్ షోలు రద్దు చేస్తున్నారు. ఆక్యుపెన్సీని 50 శాతానికి తగ్గిస్తున్నారు. ఈ నేపథ్యంలో సంక్రాంతికే రిలీజ్ చేసి హిందీ మార్కెట్ దెబ్బ తీసుకోవడం కరెక్టా అన్న ప్రశ్న తలెత్తుతోంది. కానీ ‘రాధేశ్యామ్’ టీం మాత్రం అయోమయానికి తెరదించట్లేదు. సినిమాను వాయిదా వేసేది లేదని చెబుతోంది. సంక్రాంతి రిలీజ్ పక్కా అంటోంది. కేవలం ఈ మేరకు స్టేట్మెంట్లు మాత్రమే ఇస్తున్నారు తప్ప రిలీజ్ దిశగా ఎలాంటి సన్నాహాలైతే జరగట్లేదు. ఐతే యువి క్రియేషన్స్ వాళ్లు జనవరి 14న రిలీజ్ చేయడానికి నిజంగానే పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతికి వచ్చే వసూళ్లే వేరుగా ఉంటాయి. ‘ఆర్ఆర్ఆర్’ తప్పుకోవడం కచ్చితంగా ‘రాధేశ్యాామ్’కు అడ్వాంటేజ్ అవుతుంది. ఇప్పటికే ఈ సినిమా చాలా ఆలస్యం అయి, వడ్డీల భారం బాగా పడ్డ నేపథ్యంలో వేసవి దాకా ఎదురుచూడటం.. కొత్త రిలీజ్ డేట్ కోసం తంటాలు పడటం ఎందుకని.. కాబట్టి తెలుగు రాష్ట్రాల వరకు ఇప్పుడు రిలీజ్ చేయడమే ఉత్తమమని భావిస్తున్నారట. తెలుగులో ముందు అనుకున్న దాని కంటే ఎక్కువ వసూళ్లు వస్తాయన్నది వారి అంచనా. హిందీలో కచ్చితంగా వసూళ్లపై ప్రభావం ఉంటుంది. ఐతే నార్త్ ఫ్యాన్స్ బేసిగ్గా ప్రభాస్ నుంచి మాస్ సినిమానే ఆశిస్తున్నారు.

‘రాధేశ్యామ్’పై అక్కడ అంచనాలు తక్కువే. కాబట్టి సినిమా అక్కడ మామూలుగానే భారీ వసూళ్లేమీ రాబట్టదనే అనుకుంటున్నారు. కాబట్టి నార్త్ మార్కెట్ గురించి మరీ ఇదైపోవాల్సిన పని లేదని.. సినిమాను సంక్రాంతికి థియేటర్లలో రిలీజ్ చేసి, రెండు వారాల్లోనే ఓటీటీలో విడుదల చేసేలా మంచి డీల్ సెట్ చేసుకుని.. నార్త్‌లో థియేటర్ల నుంచి పడే ఆదాయ గండిని పూడ్చుకోవాలని చూస్తున్నట్లుగా చెబుతున్నారు. ఈ విషయమై హిందీ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లతో చర్చలు జరుగుతున్నందునే ఈ గందరగోళం అని, ఏదో ఒక నిర్ణయం తీసుకుని ఒకట్రెండు రోజుల్లో రిలీజ్ విషయమై అధికారిక ప్రకటన చేస్తారని తెలుస్తోంది.