మూర్తి గారు దిగారు.. థియేటర్లు తెరుచుకున్నాయ్

ఆంధ్రప్రదేశ్‌లో థియేటర్ల వ్యవస్థ ఎన్నడూ లేని సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది కొంత కాలంగా. ఏపీలో జనాల సినీ అభిమానం ఎలాంటిదో.. సినిమాలను అక్కడ ఏ స్థాయిలో ఆదరిస్తారో.. థియేటర్లకు ఏ స్థాయిలో ఆదాయం వస్తుందో తెలిసిందే. ఐతే గత ఏడాది నుంచి మామూలుగా థియేటర్ల పరిస్థితి ఏమీ బాగా లేదు. కరోనా వల్ల ఆ ఇండస్ట్రీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. అది చాలదన్నట్లు ఏపీలో టికెట్ల రేట్ల మీద నియంత్రణ తీసుకురావడం, ఏళ్ల నాటి ధరల్ని ప్రభుత్వం పట్టుబట్టి అమలు చేయడంతో చాలా థియేటర్ల మనుగడే ప్రమాదంలో పడింది.

దీనికి తోడు ఈ మధ్య అధికారులు థియేటర్ల మీద దాడులు జరిపి నిబంధనలు పాటించని వాటిని సీజ్ చేశారు. ఇలా ఏపీలో వందకు పైగానే థియేటర్లు మూతపడ్డట్లు వార్తలొచ్చాయి. పుష్ప, శ్యామ్ సింగ రాయ్ సినిమాలు బాగా ఆడుతుండగా.. ఆర్ఆర్ఆర్ లాంటి భారీ చిత్రాలు రాబోతుండగా ఇలా థియేటర్లు మూతపడటం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. ఐతే ఈ విషయంలో ప్రభుత్వం మరీ పట్టుదలకు పోకుండా కాస్త వెసులుబాటు ఇవ్వడంతో ఏపీలో ఇటీవల మూత పడ్డ థియేటర్లన్నీ తిరిగి తెరుచుకున్నాయి.

ఏపీలో థియేటర్ల సమస్యల గురించి ఇటీవల ‘శ్యామ్ సింగ రాయ్’కి సంబంధించిన ఒక ఈవెంట్లో మాట్లాడిన సీనియర్ నటుడు ఆర్.నారాయణమూర్తి.. ఇప్పుడు సమస్యల పరిష్కారానికి నేరుగా రంగంలోకి దిగారు. కొందరు ఎగ్జిబిటర్లను వెంటబెట్టుకుని ఆయన తాజాగా మంత్రి పేర్ని నానిని కలిశారు. థియేటర్లను సీజ్ చేయడం, టికెట్ల ధరలు, ఇతర సమస్యలపై ఆయన మంత్రితో చర్చించినట్లు తెలుస్తోంది.

ఈ సమావేశ ఫలితం వెంటనే కనిపించింది. ఇటీవల సీజ్ అయిన థియేటర్లను తెరుచుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కాకపోతే ఇందుకు కొన్ని షరతులు విధించింది. అధికారులు ఎత్తి చూపిన లోటు పాట్లను సవరించుకోవడానికి, లైసెన్సులు రెన్యువల్ చేసుకోవడానికి నెల రోజుల గడువు ఇచ్చింది. ఈ లోపు అన్నీ సరిదిద్దుకుని, జరిమానాలు, లైసెన్స్ ఫీజులు కట్టి ఏ రకమైన సమస్యలూ లేకుండా చూసుకోవాలని ప్రభుత్వం సూచించింది.