కోవిడ్ బారిన పడ్డ మంచు మనోజ్!

ఈ మధ్యకాలంలో కోవిడ్ కేసులు మళ్లీ పెరిగిపోతున్నాయి. సెకండ్ వేవ్ తరువాత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రజలను ఒమిక్రాన్ అంటూ మరో వేరియంట్ వెంటాడుతోంది. ఇప్పటికే హైదరాబాద్, ముంబై, కేరళ ఇలా చాలా రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు బయటపడుతున్నాయి. అలానే మరికొందరు కోవిడ్ బారిన పడుతున్నారు. రీసెంట్ గా కమల్ హాసన్, కరీనా కపూర్ లాంటి స్టార్లకు కోవిదు సోకింది. రెండు వ్యాక్సిన్లు వేయించుకున్నప్పటికీ వారికి కోవిడ్ సోకడంతో హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకొని బయటపడ్డారు.

ఈ మధ్యనే కోలీవుడ్ స్టార్ కమెడియన్ వడివేలు సైతం కోవిడ్ బారిన పడ్డారు. ఆయనకు ఒమిక్రాన్ సోకిందేమోనని డాక్టర్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా టాలీవుడ్ హీరో మంచు మనోజ్ కి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. లాస్ట్ వీక్ లో తనను కలిసివారిని వెంటనే టెస్ట్ లు చేయించుకోవాలని సూచించారు.

తన గురించి ఆందోళన చెందొద్దని.. డాక్టర్స్, నర్స్ ల కేర్ లో ఉన్నట్లు చెప్పారు. ఈ ట్వీట్ పై స్పందించిన నెటిజన్లు ఆయన త్వరగా కోలుకోవాలంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక మంచు మనోజ్ కెరీర్ విషయానికొస్తే.. ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన చివరిగా హీరోగా నటించిన సినిమా ‘ఒక్కడు మిగిలాడు’. ఆ తరువాత ఇప్పటివరకు మరో సినిమా చేయలేదు. ‘అహం బ్రహ్మాస్మి’ అనే ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి చాలా కాలమవుతున్నా.. ఆ సినిమా ఇంకా పట్టాలెక్కలేదు.