ఇండియన్ క్రికెటర్ పర్ఫెక్ట్ పంచ్

క్రికెట్ పుట్టింది ఇంగ్లాండ్‌లో. అభివృద్ధి చెందింది కూడా ఆ దేశంలోనే. కానీ తర్వాత వేరే దేశాలు ఆటలోకి వచ్చి ఆధిపత్యం చలాయించడం మొదలుపెట్టాయి. క్రికెట్‌కు పుట్టినిల్లు అయినప్పటికీ 2019 వరకు ఆ జట్టు ఒక్క వన్డే ప్రపంచకప్ కూడా గెలవలేదు. ఒక దశలో అన్ని ఫార్మాట్లలో ఆ జట్టు బాగా వెనుకబడిపోయి ఉండేది. కొన్నేళ్ల కిందట పుంజుకుని అన్ని ఫార్మాట్లలో ఆధిపత్యం చలాయించడం మొదలుపెట్టింది.

ఐతే ఇంగ్లాండ్ కాస్త దూకుడు పెంచగానే ఆ జట్టు మాజీల అతి అంతా ఇంతా కాదు. తమ వాళ్లు బాగా ఆడితే ఓ రేంజిలో డబ్బా కొట్టడం.. వేరే జట్లు విఫలమైతే వాళ్లను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం వాళ్లకు మామూలే. ఈ జాబితాలో మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ ముందు వరుసలో ఉంటాడు. 2019లో భారత జట్టు న్యూజిలాండ్ పర్యటన సందర్భంగా ఒక మ్యాచ్‌లో 92 పరుగులకే ఆలౌటైపోయింది.

అప్పుడు అతను ఒక ట్వీట్ వేశాడు. భారత్ 92కే ఆలౌటైపోయిందని..  ఈ రోజుల్లో ఏ జట్టయినా 100 లోపు ఆలౌట్ అవుతుందంటే నమ్మశక్యంగా అనిపించడం లేదని అతను సెటైర్ వేశాడు. కట్ చేస్తే ఇప్పుడు ఇంగ్లాండ్ జట్టు యాషెస్ సిరీస్‌లో ఘోర వైఫల్యాన్ని కొనసాగిస్తూ ఆస్ట్రేలియా చేతిలో 68 పరుగులకే కుప్పకూలింది.

యాషెస్ మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 185 పరుగులు చేసిన ఆ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో ఇందులో సగం పరుగులైనా చేయలేకపోయింది. ఘోర వైఫల్యంతో ఇన్నింగ్స్ ఓటమి చవిచూసింది. వరుసగా మూడు ఓటములతో ఆ జట్టు సిరీస్‌ను కూడా చేజార్చుకుంది. ఈ నేపథ్యంలో భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ తనదైన శైలిలో ఒక ట్వీట్ వేశాడు. ఇండియా 92కే ఆలౌటైనపుడు వాన్ వేసిన ట్వీట్‌ స్క్రీన్ షాట్ తీసి అతణ్ని ట్యాగ్ చేస్తూ ఒక వీడియో పోస్ట్ చేశాడు.

దీనికి ఎలా స్పందించాలో తెలియక.. వెరీ గుడ్ వసీమ్ అంటూ నవ్వుతున్న ఎమోజీలు జోడించాడు వాన్. జాఫర్ సోషల్ మీడియాలో ఇలాగే తనదైన శైలిలో పంచ్‌లు వేస్తుంటాడు. ఇండియన్ క్రికెట్ మీద ఎవరు విమర్శలు చేసినా.. ఇలాగే కౌంటర్లు వేసి ఇండియన్ ఫ్యాన్స్‌ను అలరిస్తుంటాడు. వాన్ మీద అతను వేసిన పంచ్ పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.