హైద‌రాబాద్‌లో 5G నెట్ వర్క్

దేశీయంగా టెలికాం రంగంలో నూతన శకం ప్రారంభం కానుంది. 2022లో దేశంలో 5జీ సేవలు అందుబాటు లోకి రానున్నాయి. అయితే.. ఈ సేవ‌ల‌ను దేశ‌వ్యాప్తంగా అందిస్తున్న‌ప్ప‌టికీ.. కొన్ని న‌గ‌రాల‌కు మాత్ర‌మే ప‌రిమితం చేశారు. అయితే.. వీటిలో తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రం చోటు ద‌క్కించుకోవ‌డం విశేషం. అదేవిధంగా గురుగ్రామ్, బెంగళూరు, కోల్‌కతా, ముంబై, చండీగఢ్, ఢిల్లీ, జామ్‌నగర్, అహ్మదాబాద్, చెన్నై, లఖ్నవూ, పుణె, గాంధీనగర్ వంటి కీల‌క న‌గ‌రాల్లో మాత్ర‌మే 5జీ సేవలను తొలుత అందుబాటులోకి తీసుకురానున్నట్లు టెలికమ్యూనికేషన్ల శాఖ తెలిపింది.

దిగ్గజ టెలికాం సంస్థలు భారతీ ఎయిర్టెల్, రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా ఈ మేరకు ఏర్పాట్లు చేసినట్లు పేర్కొంది. దేశంలో 5జీ సేవలను త్వరగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు టెలికాం సంస్థలు, మొబైల్ తయారీ కంపెనీలతో పాటు ప్రభుత్వం కూడా కృషి చేస్తోంది. 5జీ టెక్నాలజీ అభివృద్ధి, పరీక్షించ డం కోసం పరిశోధనా సంస్థలను ఏర్పాటు చేసింది టెలికాం విభాగం.

స్వదేశీ 5జీ టెస్ట్ బెడ్ ప్రాజెక్ట్గా పిలిచే పరిశోధనా సంస్థలో ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ ముంబై, ఐఐటీ హైదరాబాద్, ఐఐటీ మద్రాస్, ఐఐటీ కాన్పుర్, ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సైన్స్ బెంగళూరు సహా మరో రెండు టెక్ పరిశోధన సంస్థలు పాల్గొన్నాయి. ఈ ప్రాజెక్టు కోసం రూ.224 కోట్లు ఖర్చు చేసినట్లు డాట్ తెలిపింది. 2022 మార్చి-ఏప్రిల్ నెలల్లో 5జీ స్పెక్ట్రమ్ వేలం నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది.

ఈ ఏడాది సెప్టెంబర్‌లో రిజర్వ్ ధర, బ్యాండ్ ప్లాన్, బ్లాక్ సైజు, స్పెక్ట్రమ్ క్వాంటంకు సంబంధించి టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ (ట్రాయ్) నుంచి సిఫార్సులను కోరింది డాట్. ట్రాయ్ తన వంతుగా పరిశ్రమ వాటాదారులతో ఈ సమస్యపై సంప్రదింపులు ప్రారంభించింది. వ‌చ్చే ఏడాది మార్చిలోపే.. వినియోగ‌దారుల‌కు 5జీ సేవ‌ల‌ను అందుబాటులోకి తీసుకువ‌చ్చేందుకు విశేషంగా కృషి చేస్తుండ‌డం గ‌మ‌నార్హం. అయితే.. ఈ సేవ‌ల రుసుముల‌పై ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటార‌నేది ఆస‌క్తిగా మారింది.