సతీమణితో త్రివిక్రమ్ సినిమాలు

టాలీవుడ్ స్టార్ దర్శకుల్లో దాదాపు అందరూ ఏదో రకంగా ప్రొడక్షన్లో భాగం అవుతున్న వాళ్లే. రాజమౌళి దర్శకత్వం చేయడంతో పాటు నిర్మాణ వ్యవహారాలు, ప్రమోషన్ల బాధ్యతంతా తీసుకుని పారితోషకం కాకుండా సినిమాలో వాటా తీసుకుంటున్నాడు. సుకుమార్ సొంతంగా నిర్మాణ సంస్థను పెట్టి సినిమాలు నిర్మిస్తున్నాడు. పూరి జగన్నాథ్ కెరీర్ ఆరంభంలోనే నిర్మాత అయ్యాడు.

ఇప్పుడూ ప్రొడక్షన్ కొనసాగిస్తున్నాడు. ఈ జాబితాలో మరిందరు స్టార్ డైరెక్టర్లు కనిపిస్తున్నారు. ఇప్పుడు త్రివిక్రమ్ సైతం నిర్మాణంలోకి వచ్చేస్తున్నాడు. కాకపోతే నిర్మాతగా ఆయన పేరు పడట్లేదు. త్రివిక్రమ్ తన భార్య సాయి సౌజన్యను నిర్మాతగా తీసుకొచ్చాడు. ఆమెను టాలీవుడ్లో బిజీ ప్రొడ్యూసర్‌గా మార్చే ప్రయత్నంలో ఆయనున్నాడు. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పేరుతో త్రివిక్రమ్ సొంత బేనర్ మొదలైంది. ఇప్పటికే నవీన్ పొలిశెట్టి హీరోగా ఈ సంస్థలో ఓ సినిమాను అనౌన్స్ చేశారు.

‘జాతిరత్నాలు’ సినిమాకు దర్శకత్వ శాఖలో పని చేసిన కళ్యాణ్ శంకర్ అనే కుర్రాడు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇప్పుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ హీరోగా నటించనున్న ద్విభాషా చిత్రం ‘సార్’ నిర్మాణంలోనూ త్రివిక్రమ్ సంస్థ భాగం అవుతుండటం విశేషం. ఈ చిత్రానికి ఒక నిర్మాతగా సాయి సౌజన్య పేరు పడింది. నాగవంశీ మరో నిర్మాత. త్రివిక్రమ్ ఒకప్పుడు వేర్వేరు బేనర్లలో సినిమాలు చేశాడు కానీ.. ‘జులాయి’ దగ్గర్నుంచి చినబాబు, నాగవంశీల భాగస్వామ్యంలోనే సినిమలు చేస్తున్నాడు.

ఆ సంస్థకు ఆయన ఆస్థాన దర్శకుడిగా మారిపోయారు. ఈ సంస్థలో ఆయన నిర్మాణ భాగస్వామి అని కూడా చెబుతుంటారు. ఐతే ఇన్నాళ్లూ అనధికారికంగా నిర్మాతగా ఉన్న త్రివిక్రమ్.. ఇప్పుడు అధికారికంగానే ప్రొడక్షన్లోకి దిగేస్తున్నాడు. తన భార్య సాయి సౌజన్యను టాలీవుడ్లో బిజీ ప్రొడ్యూసర్‌ను చేస్తున్నాడు. ఈ సినిమాలు రెండూ సక్సెస్ అయ్యాయంటే సాయి సౌజన్య నిర్మాతగా మరింత బిజీ అయ్యే అవకాశముంది.