భీమ్లా నాయక్.. అనుకున్నదే అయ్యింది

భీమ్లానాయక్ సంక్రాంతికి వస్తాడా? నిర్ణయం మార్చుకుంటాడా? చాలా రోజులుగా టాలీవుడ్‌ని వెంటాడుతున్న ప్రశ్న ఇది. దీనికి ప్రతిసారీ ఒకటే జవాబు చెప్పారు మేకర్స్. భీమ్లానాయక్‌ చెప్పిన టైముకే వస్తాడు అని. కానీ ఇప్పుడు సమాధానం మారింది. భీమ్లా సంక్రాంతి బరి నుంచి తప్పుకున్నాడు. కాస్త ఆలస్యంగా ఫిబ్రవరిలో రావడానికి నిర్ణయించుకున్నాడు.         

పవన్ కళ్యాణ్, రానాలతో సాగర్ చంద్ర తెరకెక్కించిన చిత్రం భీమ్లానాయక్. నిత్యామీనన్, సంయుక్తామీనన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. త్రివిక్రమ్ స్క్రీన్‌ప్లే, మాటలు రాశారు. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. మలయాళ సూపర్‌‌ హిట్ ‘అయ్యప్పనుమ్ కోశియుమ్‌’కి ఇది రీమేక్. ఇప్పటి వరకు వచ్చిన ప్రతి అప్‌డేట్ సెన్సేషన్‌ సృష్టించడంతో సినిమాపై భారీ అంచనాలున్నాయి.      

ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయనున్నట్టు ప్రకటించి చాలా కాలమే అయ్యింది. జనవరి 13న సర్కారువారి పాట, 14న రాధేశ్యామ్‌ స్లాట్స్ బుక్ చేసుకున్నాయి. అయితే రాజమౌళి ‘ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌’ రిలీజ్‌కి జనవరి 7న ముహూర్తం పెట్టడంతో సీన్ మొత్తం మారిపోయింది. ఎందుకొచ్చిన గొడవంటూ సర్కారువారి పాటను ఏప్రిల్‌కి వాయిదా వేసేశారు. భీమ్లానాయక్‌ని మాత్రం అనుకున్న సమయానికే తీసుకొస్తామని మేకర్స్ పట్టుబట్టారు. కానీ డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్‌ పట్టుదల ముందు పట్టు వదలక తప్పలేదు.        

ఈ విషయాన్ని దిల్‌రాజు ప్రెస్‌మీట్‌ పెట్టి ప్రకటించారు. భీమ్లానాయక్ సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్నాడని, ఫిబ్రవరి 25కి వాయిదా వేయడం జరిగిందని ఆయన కన్‌ఫర్మ్ చేశారు. ప్రొడ్యూసర్స్ గిల్డ్ అంతా డిస్కస్ చేసి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. సంక్రాంతికి తమ హీరో సినిమా చూడాలని ఆసక్తిగా వెయిట్ చేస్తున్న పవర్‌‌స్టార్ అభిమానుల్ని డిజప్పాయింట్ చేసే వార్త ఇది. అయితే రెండు ప్యాన్ ఇండియా సినిమాల మధ్య వచ్చి ఇబ్బందిపడే బదులు కాస్త అటూ ఇటూ అయినా సోలోగా రావడమనేది కలిసొచ్చే విషయమని ఒప్పుకుని తీరాలి.