ఎట్ట‌కేల‌కు త‌లొగ్గిన ప‌వ‌న్?

ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొత్త సినిమా భీమ్లా నాయ‌క్‌ను సంక్రాంతికి విడుద‌ల చేయాల‌ని నాలుగైదు నెల‌ల ముందే నిర్ణ‌యించారు. ఇక అప్ప‌ట్నుంచి సంక్రాంతి రిలీజ్ విష‌యంలో చాలా ప‌ట్టుద‌ల‌తో క‌నిపిస్తున్నారు. ఈ సినిమా వాయిదా గురించి ఎప్ప‌టిక‌ప్పుడు రూమ‌ర్లు వినిపిస్తుండ‌గా.. చిత్ర బృందం మాత్రం వాటిని ఖండిస్తూనే వ‌చ్చింది.

ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ లాంటి భారీ చిత్రాల‌కు థియేట‌ర్లతో పాటు క‌లెక్ష‌న్ల ప‌రంగా స‌మ‌స్య ఎదుర‌వుతుంద‌నే ఉద్దేశంతో భీమ్లా నాయ‌క్‌ను వాయిదా వేయించ‌డానికి దిల్ రాజు స‌హా కొంద‌రు ప్ర‌ముఖులు గ‌ట్టిగా ఒత్తిడి తెచ్చినా భీమ్లా నాయ‌క్ టీం త‌లొగ్గ‌న‌ట్లే క‌నిపించింది. కొన్ని వారాల నుంచి ఈ విష‌యంలో స‌స్పెన్స్ న‌డుస్తూనే ఉంది.

భీమ్లా నాయ‌క్ టీం ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త ప్రోమోలు రిలీజ్ చేస్తూ జ‌న‌వ‌రి 12 విడుద‌ల‌ను ఖ‌రారు చేస్తూనే వ‌స్తోంది. అయినా స‌రే.. దాన్ని వాయిదా వేయించేందుకు ప్ర‌య‌త్నాలు ఆగ‌లేదు.

ఐతే ఎట్ట‌కేల‌కు ఆ ప్ర‌య‌త్నాలు ఫ‌లించిన‌ట్లు తెలుస్తోంది. సంక్రాంతి రేసు నుంచి భీమ్లా నాయ‌క్ త‌ప్పుకున్న‌ట్లుగా గ‌ట్టిగా ప్ర‌చారం జ‌రుగుతోంది. కొంద‌రు పీఆర్వోలు, మీడియా ప్ర‌ముఖులు సంక్రాంతి లైన‌ప్‌పై వ‌రుస‌గా ట్వీట్లు వేస్తున్నారు. జన‌వ‌రి 7న ఆర్ఆర్ఆర్, 14న రాధేశ్యామ్, 15న బంగార్రాజు రాబోతున్న‌ట్లుగా పేర్కొంటున్నారు.

భీమ్లా నాయ‌క్ సంక్రాంతి రేసు నుంచి త‌ప్పుకుని ఫిబ్ర‌వ‌రికి వాయిదా ప‌డుతున్న‌ట్లుగా చెబుతున్నారు. గ‌త కొన్ని రోజులుగా భీమ్లా నాయ‌క్ టీం సైలెంటుగా ఉండ‌టానికి ఇదే కార‌ణ‌మంటున్నారు.

మంగ‌ళ‌వారం ఇదే విష‌యాన్ని ప్రెస్ మీట్ పెట్టి వెల్ల‌డించ‌బోతున్నార‌ని.. ఇందులో దిల్ రాజుతో పాటు భీమ్లా నాయ‌క్ నిర్మాత‌లు కూడా పాల్గొంటార‌ని.. ఇండ‌స్ట్రీ మంచి కోసం ఏ ప‌రిస్థితుల్లో సినిమాను వాయిదా వేయాల్సి వ‌చ్చిందో అభిమానుల‌కు వివ‌రించ‌బోతున్నార‌ని సమాచారం.