ఏపీలో బ్లాక్ టికెట్ల దందా ఫుల్లు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సినిమా టికెట్లను అధిక ధ‌ర‌ల‌కు అమ్మేస్తున్నారంటూ ప్ర‌భుత్వం వాటి నియంత్ర‌ణ‌కు గ‌ట్టి చ‌ర్య‌లు చేప‌డుతోంది. ప‌దేళ్ల కింద‌టి జీవోను బ‌య‌టికి తీసి ఆ మేర‌కే టికెట్ల రేట్లు ఉండాల‌ని ఆదేశాలు జారీ చేసింది. ఈ వేసవిలో వ‌కీల్ సాబ్ సినిమాతో మొద‌లైన ఈ క‌ట్ట‌డి.. ఇంకా కొన‌సాగుతోంది. ప‌ట్టుబ‌ట్టి ఏళ్ల నాటి ధ‌ర‌ల‌తో టికెట్లు అమ్మిస్తోంది. ఇదంతా ప్రేక్ష‌కుల జేబులు గుళ్ల‌కాకుండా ఉండ‌టం కోస‌మే అని నొక్కి వ‌క్కాణిస్తోంది.

ఈ నిబంధ‌న‌లు బాగున్నాయి, ప్ర‌క‌ట‌న‌లు బాగున్నాయి. కానీ క్షేత్ర స్థాయిలో జ‌రుగుతోందేంటో చూస్తే ప్ర‌భుత్వ ఉద్దేశం ఏమేర నెర‌వేరుతోంద‌న్న‌ది ప్ర‌శ్నార్థ‌కంగానే క‌నిపిస్తోంది. ఎన్న‌డూ లేని విధంగా ఏపీలో బ్లాక్ టికెట్ల దందా న‌డుస్తోంది కొన్ని రోజులుగా. ఈ నెల ఆరంభంలో అఖండ రిలీజైన‌పుడు విప‌రీతంగా బ్లాక్ టికెట్ల అమ్మ‌కాలు సాగ‌గా.. పుష్ప మూవీకి అది మ‌రింత హెచ్చు స్థాయికి వెళ్లింది.

ఆన్ లైన్లో చూస్తే టికెట్లు అమ్ముడైపోయిన‌ట్లు ఉంటాయి. కొన్ని థియేట‌ర్ల‌కు ఆన్ లైన్ బుకింగే పెట్ట‌రు. థియేట‌ర్ల ద‌గ్గ‌రికి వెళ్తే కౌంట‌ర్ల‌లో టికెట్లు ఉండ‌వు. అయిపోయాయంటారు. కానీ బ‌య‌ట చూస్తే 100 రూపాయ‌ల టికెట్‌ను 300-400కు అమ్ముతుంటారు. పుష్ప రిలీజ్ రోజు మొద‌లుకుని.. వీకెండ్ అంతా ఇదే ప‌రిస్థితి. చాలా చోట్ల టికెట్ రేటు మీద మూణ్నాలుగు రెట్ల‌కు టికెట్లు అమ్ముతున్నారు. ఇది ఊహాగానం కాదు. మెజారిటీ థియేట‌ర్ల‌లో ప‌రిస్థితి ఇదే.

ఒక ప‌ద్ధ‌తి ప్ర‌కారం థియేట‌ర్ల యాజ‌మాన్యాలు, అందులోని సిబ్బంది ఈ బ్లాక్‌మార్కెట్ దందాను న‌డిపిస్తున్న‌ట్లు తెలుస్తోంది. పెద్ద ఎత్తున టికెట్ల‌ను బ్లాక్ చేసేసి డిమాండును బ‌ట్టి బ్లాక్‌లో భారీ రేటుతో అమ్మేస్తున్నారు. ప్ర‌భుత్వం టికెట్ల రేట్ల‌పై నియంత్ర‌ణ తేవ‌డంతో బ్లాక్ టికెట్ల దందా పెరుగుతుంద‌ని అగ్ర నిర్మాత సురేష్ బాబు వేసిన అంచ‌నా ఇప్పుడు నిజ‌మే అవుతోంది. ప్ర‌భుత్వం నిర్దేశించిన రేట్ల‌తో టికెట్లు అమ్మితే గిట్టుబాటు కాక బ్లాక్ టికెట్ల బాట ప‌డుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. ఐతే ఇలా ఎగ్జిబిట‌ర్లు బాగానే సంపాదిస్తుండొచ్చు కానీ.. డిస్ట్రిబ్యూట‌ర్లు, నిర్మాత‌ల‌కు ఏమేర ప్ర‌యోజ‌నం ద‌క్కుతోంద‌న్న‌దే ప్ర‌శ్నార్థ‌కం.