‘మజిలీ’ పిల్లకి మంచి రోజులొచ్చాయ్

కొందరు కన్నుమూసి తెరిచేలోగా స్టార్ హీరోయిన్స్ అయిపోతుంటారు. కొందరు మాత్రం అవకాశాలు రాక వెనకబడిపోతుంటారు. ‘మజిలీ’లో దివ్యాంశ కౌశిక్‌ని చూసినప్పుడు ఆమె మొదటి కేటగిరీకి చెందుతుందని అనుకున్నారంతా. కానీ ఆ తర్వాత ఒక్క చాన్స్ కూడా రాకపోవడంతో రెండో కేటగిరీలో వేశారు. అయితే లేటుగా వచ్చినా లేటెస్టుగా వస్తా అన్నట్టు.. ఒక్కసారిగా దివ్యాంశ కెరీర్ స్పీడందుకుంది.

‘మజిలీ’ మూవీలో నాగచైతన్య లవర్‌‌ పాత్రలో కూల్ అండ్ క్యూట్‌గా కనిపించింది దివ్యాంశ. తన లుక్స్‌తోటి, పర్‌‌ఫార్మెన్స్‌తోటి మెప్పించింది. కానీ ఎందుకో ఆ సినిమా తర్వాత ఆమెకి అవకాశాలు రాలేదు. చాలా గ్యాప్‌ తర్వాత తమిళంలో ఓ సినిమాకి సెలెక్టయ్యింది. సిద్ధార్థ హీరోగా నటిస్తున్న ఆ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది దివ్యాంశ. ఇంతలో ఉన్నట్టుండి తెలుగు ఫిల్మ్ మేకర్స్‌ దృష్టి దివ్యాంశ వైపు మళ్లింది. దాంతో వరుస అవకాశాలు అందిపుచ్చుకుంటోందామె.

ఆల్రెడీ ‘రామారావ్ ఆన్‌ డ్యూటీ’లో రవితేజతో కలిసి నటిస్తోంది దివ్యాంశ. శరత్ మండవ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో రాజీషా విజయన్ మరో హీరోయిన్‌. రవితేజ గవర్నమెంట్ ఆఫీసర్‌‌గా పవర్‌‌ఫుల్‌ రోల్‌లో కనిపించనుండటంతో మూవీపై మంచి అంచనాలున్నాయి. అలాంటి మూవీలో చాన్స్ కొట్టేయడం దివ్యాంశకి కలిసొచ్చే అంశమే. ఇక ఇప్పుడు మరో సూపర్బ్ చాన్స్ దొరికిందామెకి. సందీప్ కిషన్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న ‘మైఖేల్’ మూవీలోనూ హీరోయిన్ చాన్స్ దక్కింది.

రంజిత్ జయకోడి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ అనౌన్స్‌మెంట్ కొద్ది రోజుల క్రితం వచ్చింది. రీసెంట్‌గా షూటింగ్ కూడా స్టార్టయ్యింది. నారాయణదాస్ నారంగ్ సమర్పణలో భరత్‌ చౌదరి, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. గౌతమ్‌ మీనన్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ చిత్రంలో తీర అనే పాత్రలో దివ్యాంశ నటిస్తున్నట్టు టీమ్ ప్రకటించింది. సందీప్, సేతుపతి, గౌతమ్ పాత్రలతో సమానంగా దివ్యాంశ రోల్ ఉంటుందట. ఈ రెండు సినిమాలూ కనుక సక్సెస్ అయితే దివ్యాంశ కెరీర్‌‌ మలుపు తిరగడం ఖాయం.