జ‌స్టిస్ చంద్రుకు.. చంద్ర‌బాబు స్ట్రాంగ్ కౌంట‌ర్‌

ఏపీ హైకోర్టును ఉద్దేశించి ఇటీవ‌ల త‌మిళ‌నాడులోని మ‌ద్రాస్ హైకోర్టు రిటైర్డ్ న్యాయ‌మూర్తి జస్టిస్ చంద్రు చేసిన వ్యాఖ్య‌లు సంచలనం సృష్టించిన విష‌యం తెలిసిందే. జ‌స్టిస్ చంద్రు వ్యాఖ్య‌ల‌పై హైకోర్టు కూడా సీరియ‌స్ అయింది. లైమ్ లైట్‌లో ఉండాల‌ని భావిస్తున్న‌వారి లైట్స్ ఆపేస్తామ‌ని తీవ్రంగా స్పందించింది. ఇక‌, ఈ విష‌యంలో రాజ‌కీయ నాయ‌కులుకూడా సీరియ‌స్ అయ్యారు. తాజాగా టీడీపీ అదినేత చంద్ర‌బాబు.. కూడా జ‌స్టిస్ చంద్రుపై సీరియ‌స్ అయ్యారు. జ‌స్టిస్ చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌ల‌పై ఆయ‌న తీవ్రంగా స్పందించారు.

అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన చంద్ర‌బాబు.. జ‌స్టిస్ చంద్రు వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. ‘ఒక జడ్జి ఎక్కడ్నుంచో ఇక్కడికి వచ్చి రాజ్యాంగ ఉల్లంఘన అంటున్నారు!. రాష్ట్రంలో ఉన్న దారుణ పరిస్థితులు వీళ్లకు పట్టవా?. రాష్ట్రంలో కొందరు పేటీఎమ్ బ్యాచ్‌లుగా తయారయ్యారు. ఏపీలో ఆత్మహత్యలు, అల్లకల్లోలం ఆ జడ్జీలకు కనపడదా!. ఒక నేరస్థుడికి ఇలాంటి వాళ్ళు సపోర్ట్ చేయవచ్చా!. రిటైర్ అయిన తర్వాత వీళ్ళకి పదవులు కావాలి.. అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు.

ఒకాయన సుప్రీంకోర్టు జడ్జ్‌గా పని చేశారు. ఆయన కుమారుడికి ఏపీలో పదవి తీసుకుని జగన్‌ను పొగుడుతున్నా రు’ అని చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎంతో మంది ప్రాథమిక హక్కులను కాపాడుతున్నామని, జస్టిస్ చంద్రు ఆరోపణలు నిరాధారమైనవని ఆయన వ్యాఖ్యానించారు. మొత్తం హైకోర్టును ఎలా నిందిస్తారని అన్నారు. ప్ర‌స్తుతం చంద్ర‌బాబు ఈ రేంజ్‌లో ఫైర్ అవ‌డం ఆశ్చ‌ర్యంగా ఉంద‌ని టీడీపీ నేత‌లు వ్యాఖ్యానిస్తున్నారు.

కాగా, ఏపీ హైకోర్టు తన పరిధి దాటి వ్యవహరిస్తోందని, ప్రభుత్వం శత్రువులు, ప్రత్యర్థులతో కాదు న్యాయవ్యవస్థతో యుద్ధం చేస్తోందని జస్టిస్ చంద్రు ఇటీవ‌ల వ్యాఖ్యానించారు. అంతేకాదు.. అమరావతి భూస్కామ్‌లో ఎఫ్ఐఆర్‌ రిజిస్టర్‌ చేస్తే హైకోర్టు స్టే ఇచ్చిందని, కోర్టులు న్యాయం చేయాల్సిందిపోయి ఏదో చేయడానికి ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్య‌ల‌పై స‌ర్వ‌త్రా విస్మ‌యం వ్య‌క్తం అవుతుండ‌డంతోపాటు.. హైకోర్టు కూడా సీరియ‌స్‌గా రియాక్ట్ కావ‌డం గ‌మ‌నార్హం.