ఏపీకి ఆర్ధిక క్ర‌మ శిక్ష‌ణ లేదు.. కేంద్రం ఫైర్‌

ఏపీకి ఆర్థిక క్ర‌మ శిక్ష‌ణ మ‌చ్చుకైనా క‌నిపించ‌డం లేద‌ని.. కేంద్ర ప్ర‌భుత్వం తీవ్ర‌స్థాయిలో ఫైరైంది. అందుకే ఆర్థిక లోటుతో ఇబ్బందు లు ప‌డుతోంద‌ని.. ఈ విష‌యంలో ఎవ‌రూ ఏమీ చేయ‌లేర‌ని కేంద్రం కుండ‌బ‌ద్ద‌లు కొట్టింది. అంతేకాదు, ప్ర‌భుత్వం చేస్తున్న దుబారా తీవ్రంగా ఉంద‌ని కేంద్రం క‌డిగిపారేసింది. రాజ్య‌స‌భ‌లో ఆర్థిక ప‌రిస్థితిపై జ‌రిగిన చ‌ర్చ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌.. ఏపీ విష‌యంపై మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా కంప్ట్రోల‌ర్ అండ్ ఆడిట‌ర్ జ‌న‌ర‌ల్‌.. తాజాగా అందించిన నివేదిక‌లోని కొన్ని కీల‌క అంశాల‌ను ఈ సంద‌ర్భంగా ఆమె చ‌దివి వినిపించారు.

“ఆర్థిక క్ర‌మ శిక్ష‌ణ పాటించే రాష్ట్రాలే.. క‌రోనా కార‌ణంగా.. తీవ్రంగా దెబ్బ‌తిన్నాయి. అలాంటి రాష్ట్రాల‌ను ఆదుకునేందుకే జీఎస్టీ చెల్లింపులు స‌హా ఇత‌ర రూపాల్లో సాయం చేస్తున్నాం. అయితే.. ఆర్థికంగా కొన్ని రాష్ట్రాలు క్ర‌మ‌శిక్ష‌ణ పాటించ‌డం లేదు. ఇష్టాను సారం వ్య‌వ‌హ‌రిస్తున్నాయి. ఈ విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం ఎప్ప‌టిక‌ప్పుడు హెచ్చ‌రిక‌లు జారీ చేస్తోంది“ అని తెలిపారు.

ఆర్థిక క్ర‌మ శిక్ష‌ణ పాటించ‌డంలో విఫ‌ల‌మైన రాష్ట్రాల్లో ఏపీ ముందువ‌రుస‌లో ఉంద‌ని.. త‌ర్వాత‌.. యూపీ, బీహార్‌, తెలంగాణ, త‌మిళ‌నాడు రాష్ట్రాలు ఉన్నాయ‌ని కేంద్ర ఆర్థిక మంత్రి చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఏపీ విష‌యానికి వ‌స్తే.. రాష్ట్ర ప్ర‌బుత్వం ప్ర‌జ‌ల‌కు ఉచితాలు ఇవ్వ‌డం వ‌ల్ల‌.. ఆర్థికంగా ఇబ్బందులు ఏర్ప‌డుతున్నా యని.. తెలిపారు. వీటిలో అమ్మ ఒడి, ఆస‌రా, సామాజిక ఫించ‌న్లు ఉన్నాయ‌ని కేంద్ర మంత్రి నిర్మ‌ల తెలిపారు.

అదేస‌మ‌యంలో కేంద్ర ప్రభుత్వ ప‌థ‌కాల‌కు ఇస్తున్న నిధుల‌ను కూడా రాష్ట్ర ప్ర‌బుత్వం ఆయా సంక్షేమ ప‌థ‌కాల‌కు మ‌ళ్లిస్తున్న విష‌యాన్ని కాగ్ కూడా స్ప‌ష్టం చేసింద‌న్నారు. బ్యాంకులు, కార్పొరేష‌న్ల నుంచి రుణాలు తీసుకోవ‌డం త‌ప్పుకాద‌న్న మంత్రి నిర్మ‌ల .. అయితే.. ఇవి ప‌రిమితికి మించిపోయాయ‌ని తెలిపారు. ఇలాంటి వాటి వ‌ల్ల రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి భవిష్య‌త్తులో మ‌రింత దెబ్బ‌తింటుంద‌ని హెచ్చ‌రించారు. మొత్తానికి రాష్ట్ ఆర్థిక ప‌రిస్థితిపై తాము ఎప్ప‌టికప్పుడు నివేదిక‌లు ఇస్తున్న‌ట్టు మంత్రి వివ‌రించారు.