యువ‌గ‌ళానికి 200 రోజులు.. యువ నేత ప్ర‌స్థానం!!

టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర కీల‌క రికార్డును సొంతం చేసుకుంది. ఈ పాద‌యాత్రకు అప్పుడే 200 రోజులు పూర్త‌య్యాయి. ఈ 200 రోజుల యాత్ర కూడా అల‌వోక‌గా సాగిపోవ‌డం గ‌మనార్హం. తొలినాళ్ల‌లో అటు పోలీసుల నుంచి ఇటు ప్ర‌త్య‌ర్థి పార్టీల నుంచి కొంత ఇబ్బందులు ఎదురైనా.. త‌ర్వాత త‌ర్వాత యాత్ర సునాయాశంగానే ముందుకు సాగిపోయింద‌ని చెప్పాలి.

సుదీర్ఘ ల‌క్ష్యం

వ‌చ్చే 2024 ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా.. యువ‌గ‌ళానికి టీడీపీ యువ నాయ‌కుడు ప్రాణం పోశారు. ఈ ఏడాది జనవరి 27న కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలో అత్యంత ఆడంబ‌రంగా ప్రారంభమైన పాదయాత్ర సీమ స‌హా నెల్లూరు, ప్ర‌కాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పూర్తి చేసుకుని నేటికి 200వ రోజుకు చేరుకుంది. ఇక‌, ఇప్ప‌టి వ‌ర‌కు 77 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2,710 కిలోమీటర్ల మేర పాదయాత్ర ముగిసింది.

4 వేల కిలో మీట‌ర్లు..

మ‌రో 1300 కిలో మీట‌ర్ల మేర‌కు యువ‌గ‌ళం పాద‌యాత్ర సాగాల్సి ఉంది. షెడ్యూల్ ప్ర‌కారం.. మొత్తం 4 వేల కిలో మీట‌ర్ల దూరాన్ని నారా లోకేష్ పూర్తి చేయాల్సి ఉంది. అదేస‌మ‌యంలో 400 రోజులు అనుకున్నా.. ఇప్ప‌టికే షెడ్యూల్లో పేర్కొన్న దానిక‌న్నా వేగంగా పాద‌యాత్ర‌ను పూర్తి చేస్తున్న నేప‌థ్యంలో 350 రోజుల‌కే యాత్ర ముగిసే అవ‌కాశం ఉంటుంద‌ని పార్టీ నేత‌లు అంచ‌నా వేస్తున్నారు.

బాబు విషెస్‌

యువ‌గ‌ళం పాద‌యాత్ర 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా యువనేత నారా లోకేష్‌కు టీడీపీ అధ్యిక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలియజేశారు. యువగళం ప్రజాగళం అయ్యింది అని పేర్కొన్నారు. మున్ముందు మ‌రింత ప్ర‌జాద‌ర‌ణ పొందాల‌ని అభిల‌షించారు.