రవిశాస్త్రి.. ఇలా దొరికేశాడేంటి?

భారత క్రికెట్ జట్టు డైరెక్టర్‌గా, కోచ్‌గా సుదీర్ఘ కాలం జట్టుతో ఉన్న రవిశాస్త్రి.. ఇటీవలే కోచ్ పదవి నుంచి దిగిపోయాడు. రవిశాస్త్రి గతంలో డైరెక్టర్ పదవి నుంచి దిగిపోయినపుడు.. ఆపై తొలిసారి కోచ్ పదవికి పోటీ పడినపుడు.. ఆపై కోచ్‌గా ఎంపికైనపుడు వివాదాలు నెలకొన్నాయి. 2014లో భారత జట్టు విదేశాల్లో ఘోర ప్రదర్శన చేశాక డంకన్ ఫ్లెచర్ అర్ధంతరంగా కోచ్ పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చినపుడు రవిశాస్త్రి తాత్కాలికంగా డైరెక్టర్ పదవిని చేపట్టాడు. పూర్తి స్థాయి కోచ్‌ను నియమించే వరకు తాత్కాలికంగానే ఆ బాధ్యతలను రవిశాస్త్రికి అప్పగించారు. ఐతే తర్వాత కోచ్ పదవికి ఇంటర్వ్యూలు నిర్వహించాలనుకున్నపుడు రవిశాస్త్రిని డైరెక్టర్ పదవికి రాజీనామా చేయమన్నారు.

కోచ్ పదవి కావాలంటే దరఖాస్తు చేసుకుని ఇంటర్వ్యూలకు రావాలన్నారు. ఐతే దీనికి రవిశాస్త్రి నొచ్చుకున్నాడు. కోచ్ పదవి కోసం పోటీ పడగా.. గంగూలీ నేతృత్వంలోని క్రికెట్ సలహా కమిటీ అప్పుడు అతణ్ని కాదని కుంబ్లేను కోచ్‌గా నియమించింది. దీంతో రవిశాస్త్రికి గర్వభంగమైంది. కానీ ఏడాది తిరిగేసరికే కెప్టెన్ కోహ్లితో కుంబ్లేకు పడకపోవడంతో అతను కోచ్ పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. కోహ్లికి ఇష్టుడైన రవిశాస్త్రినే కోచ్ అయ్యాడు. తర్వాత కథ తెలిసిందే. ఐతే కోచ్ పదవికి కుంబ్లేతో కలిసి పోటీలో ఉన్నపుడు తనను పక్కన పెట్టినందుకు గంగూలీ మీద రవిశాస్త్రికి మామూలు కోపం లేదు. అందుకే ఇప్పుడు ఇంటర్వ్యూలిస్తూ గంగూలీ పేరెత్తకుండానే పరోక్ష విమర్శలు చేస్తున్నాడు. కుంబ్లే దిగిపోయాక తప్పక తననే కోచ్‌గా ఎంపిక చేశారని.. ఐతే అంతకుముందు తనను కాదన్న వారికి అది చెంపపెట్టులాంటి సమాధానం అని రవిశాస్త్రి చేసిన వ్యాఖ్య గంగూలీని ఉద్దేశించిందే అన్నది స్పష్టం.

ఇదిలా ఉంటే రవిశాస్త్రి కోచ్‌గా ఉన్న సమయంలో గొప్ప విజయాలున్నాయి. అలాగే వైఫల్యాలూ ఉన్నాయి. ముఖ్యంగా ఐసీసీ టోర్నీలు వేటిలోనూ భారత్ గెలవలేదు. ఐతే రవిశాస్త్రి తీరెలా ఉంటుందంటే విజయాలన్నింటికీ తాను క్రెడిట్ తీసుకోవడానికి ముందుంటాడు. ఓటములు, ఇంకేవైనా వైఫల్యాల సంగతి ఎత్తితే సాకులు వెతుకుతాడు. ఇది ముందు నుంచి మీడియా వాళ్లు గమనిస్తున్న విషయమే. తాజా ఇంటర్వ్యూలో అతను చేసిన వ్యాఖ్యలు ద్వంద్వ ప్రమాణాలకు అద్దం పట్టేవే. ప్రస్తుతం ప్రపంచంలోనే మేటి ఫాస్ట్ బౌలర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్న బుమ్రాను టెస్టు జట్టులోకి తెచ్చింది తానే అని రవిశాస్త్రి చెప్పాడు. సెలక్టర్లకు కూడా చెప్పకుండా 2018 దక్షిణాఫ్రికా టూర్‌కు ముందు బుమ్రాకు ఫోన్ చేసి నువ్వీ టెస్టు సిరీస్‌కు రెడీ ఉండు అని చెప్పాడట రవిశాస్త్రి.

తర్వాత సెలక్టర్లకు, కోహ్లికి ఫోన్ చేసి బుమ్రాను ఎంపిక చేయాలని సూచించాడట. ఐతే ఇదే రవిశాస్త్రి.. 2019 వన్డే ప్రపంచకప్‌కు రాయుడిని ఎంపిక చేయకపోవడంపై చెప్పిన సమాధానం వింటే ఆశ్చర్యపోవాల్సిందే. రాయుడిని ఎంపిక చేయకపోవడం తప్పే అని.. ధోని, పంత్, దినేశ్ కార్తీక్‌ల రూపంలో ముగ్గురు వికెట్ కీపర్లను ఎంపిక చేయడంలో అర్థం లేదని అన్నాడు. మరి రాయుడిని ఎంపిక చేయడానికి మీరెందుకు చొరవ తీసుకోలేదంటే.. తనకు సెలక్టర్ల నిర్ణయాల్లో జోక్యం చేసుకునే అలవాటు లేదన్నాడు. మరి బుమ్రా విషయంలో మాత్రం తనే నిర్ణయం తీసుకుని సెలక్టర్లకు సూచించినట్లు చెబుతూ.. రాయుడి విషయంలో మాత్రం సెలక్టర్ల విషయాల్లో జోక్యం చేసుకోలేననడం విడ్డూరం. అంటే పాజిటివ్ విషయాలు ఏవైనా సరే.. క్రెడిట్ రవిశాస్త్రికి దక్కాలి. నెగెటివ్ విషయాలు సెలక్టర్ల మీద తోసేయడం అన్నమాట.