కాంగ్రెస్ తెలివి త‌క్కువ ప‌ని

ఓ వైపు దేశంలో తిరిగి కాంగ్రెస్‌కు పున‌ర్వైభవం తెచ్చే దిశ‌గా యువ నాయ‌క‌త్వం ప‌నిచేస్తుంటే.. మ‌రోవైపు ఆ పార్టీ సీనియ‌ర్ నేత‌లు మాత్రం సొంత పార్టీపై విమ‌ర్శ‌లు చేయ‌డం మాన‌డం లేదు. ద‌శాబ్దాలుగా పార్టీలో కొన‌సాగుతున్న సీనియ‌ర్ నాయ‌కులు కాంగ్రెస్ త‌ప్పుల‌ను, అస‌మ‌ర్థ‌త‌ను బ‌య‌ట పెడుతూనే ఉన్నారు. వ‌చ్చే ఏడాది జ‌రిగే అయిదు రాష్ట్రాల ఎన్నిక‌ల్లో పార్టీని గెలిపించే వ్యూహాల‌ను సిద్ధం చేయాల్సింది పోయి.. పార్టీకి న‌ష్టం క‌లిగేలా వాళ్లు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. మొన్న గులాం న‌బీ అజాద్‌.. ఇప్పుడేమో ఎంపీ శ‌శిథ‌రూర్ పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టే వ్యాఖ్య‌లు చేశారు.

వ‌చ్చే లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌కు 300 సీట్లు రావ‌డం క‌ష్ట‌మేన‌ని అజాద్ వ్యాఖ్యానించిన సంగ‌తి తెలిసిందే. ఇక ఇప్పుడేమో పార్టీ గ‌తంలో తెలివి త‌క్కువ ప‌ని చేసింద‌ని కాంగ్రెస్ ఎంపీ శ‌శిథ‌రూర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇటీవ‌ల బెంగాల్ ముఖ్య‌మంత్రి, తృణ‌మూల్ కాంగ్రెస్ అధినేత్రి మ‌మ‌తా బెన‌ర్జీ కాంగ్రెస్‌కు వ్య‌తిరేకంగా వ్యాఖ్య‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. కాంగ్రెస్ కూట‌మి ఎక్కడుంది? అని ప్ర‌శ్నించిన ఆమె.. మోడీకి ప్ర‌త్యామ్నాయంగా ఎదిగే శ‌క్తి త‌న‌కే ఉంద‌ని భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఆమె కాంగ్రెస్‌కు వ్య‌తిరేకంగా మాట్లాడేందుకు ఓ కార‌ణం ఉంద‌ని శ‌శిథ‌రూర్ పేర్కొన్నారు. గ‌తంలో దీదీకి కాంగ్రెస్ మ‌ద్ద‌తుగా నిల‌వ‌కుండా తెలివి త‌క్కువ ప‌నిచేసింద‌ని.. అందుకే ఆమె ఇప్పుడు కాంగ్రెస్‌పై వ్య‌తిరేక‌త వ్య‌క్తం చేస్తున్నార‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు.

అయితే మ‌మ‌తా బెన‌ర్జీ భ‌విష్య‌త్‌లో కాంగ్రెస్‌తో క‌లిసి ప‌ని చేస్తార‌ని ఆశిస్తున్న‌ట్లు శ‌శిథ‌రూర్ చెప్పారు. అయితే ప్ర‌స్తుత ప‌రిస్థితులు చూస్తుంటే అది సాధ్య‌మ‌యేలా క‌నిపించ‌డం లేదు. అయిదు రాష్ట్రాల ఎన్నిక‌ల నేప‌థ్యంలో త‌న పార్టీని విస్త‌రించే ప్ర‌య‌త్నాల్లో దీదీ ఉన్నారు. జాతీయ స్థాయిలో మోడీకి ప్ర‌త్యామ్నాయంగా ఎదిగేందుకు ఆమె వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు. మ‌రోవైపు దివంగ‌త కాంగ్రెస్ ప్ర‌ధాని ఇందిరా గాంధీ హ‌యాంలో విధించిన ఎమ‌ర్జెన్సీకి వ్య‌తిరేకంగా తాను చాలా వ్యాసాలు రాశాన‌ని శ‌శిథ‌రూర్ అన్నారు. వాటికి ఇప్ప‌టికీ క‌ట్టుబ‌డి ఉంటాన‌ని చెప్ప‌డం గ‌మ‌నార్హం. అయితే అప్ప‌టి కాంగ్రెస్, ఇప్ప‌టి కాంగ్రెస్ వేర్వేర‌ని ఆయ‌న వివ‌రించారు.