సుకుమార్.. ఏం స్ట్రాటజీ అయ్యా

సుకుమార్ సినిమా అంటే.. ఐటెం సాంగ్ పక్కా. ఇది ఆయనొకక సెంటిమెంటులా మారిపోయింది. తొలి సినిమా నుంచి ఈ సెంటిమెంటును ఫాలో అవుతూ వస్తున్నాడు. ‘1 నేనొక్కిడినే’ లాంటి సీరియస్ థ్రిల్లర్లో సైతం సుకుమార్ ఐటెం సాంగ్ సెంటిమెంటును పక్కన పెట్టలేదు. ఇక ‘పుష్ప’ లాంటి మాస్ మసాలా మూవీలో ఐటెం సాంగ్ లేకుండా ఎలా ఉంటుంది? ఈ సినిమా కోసం ‘ఊ అంటావా మావా.. ఉఊ అంటావా మావా’ అంటూ సాగే ఐటెం సాంగ్‌ను తాజాగా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

నిన్న సాయంత్రం ఈ పాట లాంచ్ అయినప్పటి నుంచి సోషల్ మీడియాలో దాని గురించి పెద్ద చర్చే నడుస్తోంది. ట్యూన్లో అంత ఊపు లేదని, ‘వీడొక్కడే’ సినిమాలో ఐటెం సాంగ్‌కు దగ్గరగా ఉందని.. ఇలా కొన్ని నెగెటివ్ కామెంట్స్ కూడా వస్తున్నప్పటికీ.. ఈ పాట హాట్ టాపిక్ అవుతున్న మాట వాస్తవం. ముఖ్యంగా ఈ పాటలో సమంత సూపర్ సెక్సీగా కనిపించడమే చర్చనీయాంశం అవుతోంది. నిజానికి ‘పుష్ప’ ఐటెం సాంగ్ ఎవరితో చేయించాలనే విషయంలో సుక్కు అండ్ టీంలో చాన్నాళ్లు తర్జన భర్జనలు నడిచాయి.

రకరకాల పేర్లను పరిశీలించి చివరికి సమంతను ఎంచుకున్నారు. ఐతే ఈ సమాచారం బయటికి వచ్చినపుడు చాలామంది నెగెటివ్‌గానే రియాక్టయ్యారు. సమంతలో అంతగా సెక్సప్పీల్ ఉండదని.. అయినా గ్లామర్ క్యారెక్టర్లు వదిలేసి లేడీ ఓరియెంటెడ్, పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ సినిమాలు చేసుకుంటున్న సమంతతో ఈ పాట చేయించడమేంటని అన్నారు చాలామంది. కానీ సుక్కు.. వ్యూహాత్మకంగానే ఈ పాటను సామ్‌తో చేయించాడన్నది స్పష్టం. ఈ పాట లిరిక్స్ గమనిస్తే.. మగాళ్ల వంకర బుద్ధులు ఎలా ఉంటాయో, అమ్మాయిల విషయంలో వాళ్ల తీరు ఎలా ఉంటుందో కొంచెం కొంటెగా, అలాగే ఫిలసాఫికల్‌గా చెబుతున్నట్లుగా ఉన్నాయి.

ఈ మధ్యే నాగచైతన్య నుంచి విడిపోయిన సమంత కొంత వైరాగ్యంతో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి టైంలో సమంతతో.. మగాళ్ల సైకాలజీ మీద కౌంటర్లు వేసేలా పాట చేయించడంతో జనాలు దీనికి బాగా కనెక్టవుతున్నారు. దీన్ని బట్టి సమంతతోనే సుక్కు స్ట్రాటజిగ్గానే ఈ పాట చేయించాడనే విషయం అర్థమై.. ఆయన బుర్రే బుర్ర అని కొనియాడుతున్నారు.