తిరుమలకు మరో ఘాట్ రోడ్డు…టీటీడీ సంచలన నిర్ణయం

ఈ రోజు సమావేశమైన తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం బోర్డు కీలక నిర్ణయాలు తీసుకుంది. తిరుమలలో మూడో ఘాట్ రోడ్డు నిర్మించాలని టీటీడీ నిర్ణయించింది. ప‌ద‌క‌వితా పితామ‌హుడిగా ఖ్యాతి గడించిన అన్న‌మ‌య్య పేరును ఆ మార్గానికి పెట్టాలని నిర్ణయించింది. అన్నమయ్య న‌డిచి తిరుమ‌ల‌కు చేరుకున్న ఆ మార్గాన్ని అభివృద్ధి చేయాలని టీటీడీ సంకల్పించింది. అన్నమయ్య ఘాట్ రోడ్డులో ప్ర‌యాణిస్తే తిరుప‌తికి వెళ్లాల్సిన అవ‌స‌రం లేకుండా నేరుగా తిరుమ‌ల‌లోని తుంబూరు కోన‌కు చేరుకోవచ్చు.

రేణిగుంట మండ‌లంలోని క‌ర‌కంబాడీ-బాల‌ప‌ల్లి నుంచి అన్నమయ్య ఘాట్ రోడ్డు మార్గం మొదలవుతుంది. ఆల్రెడీ ఈ మార్గం ద్వారా క‌డ‌ప జిల్లాకు చెందిన భ‌క్తులు తిరుమ‌ల కొండ‌కు వస్తుంటారు. ఈ మార్గంలో ఇప్పటికే శ‌తాబ్దాల క్రితం యాత్రికుల కోసం ఏర్పాటైన స‌త్రాలు కనిపిస్తుంటాయి. కానీ, ఈ మార్గంలో ఒంట‌రిగా వెళ్లడం శ్రేయ‌స్కరం కాకపోవడంతో దీనికి అంత గుర్తింపు రాలేదు. అయితే, టీటీడీ ఈ మార్గాన్ని అభివృద్ది చేయడం వల్ల భవిష్యత్తులో భ‌క్తులు పెద్ద సంఖ్య‌లో ఈ మార్గాన్ని వినియోగించుకునే అవకామశముంది.

దీంతోపాటు, టీటీడీ పాలక మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 10 రోజులపాటు భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనం కల్పిస్తామని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అన్నారు. కోవిడ్ తీవ్రత తగ్గితే సంక్రాంతి తర్వాత సర్వదర్శనం పెంపు, ఆర్జిత సేవలకు భక్తులను అనుమతిస్తామన్నారు.

చిన్నపిల్లల ఆసుపత్రి నిర్మాణానికి విరాళాలు అందించిన భక్తులుకు ఉదయాస్తమాన సేవకు అనుమతిస్తామన్నారు. నాదనీరాజనం మండపం దగ్గర శాశ్వత ప్రాతిపాదికన మండపాన్ని నిర్మిస్తామన్నారు. రూ. 3 కోట్ల రూపాయల వ్యయంతో వసతి గదుల్లో గీజర్లు ఏర్పాటు చేస్తామన్నారు. టీటీడీ ఐటీ వింగ్ కోసం అర్హత కలిగిన ఉద్యోగులతో ప్రత్యేక టీటీడీ ఐటీ వింగ్ ఏర్పాటు చేస్తామని వైవీ చెప్పారు.