ప్రభాస్ ఎట్టకేలకు రంగంలోకి..

దిగాడుప్రభాస్ త్వరలోనే ‘రాధేశ్యామ్’తో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ఈ సినిమా మేకింగ్ దశలో ఉండగా గత ఏడాది ఒకటికి మూడు భారీ చిత్రాలను అతను అనౌన్స్ చేశాడు. అందులో ముందుగా ప్రకటించింది నాగ్ అశ్విన్ మూవీనే. వైజయంతీ మూవీస్ నిర్మాణంలో దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్లో ఈ సినిమా తెరకెక్కించడానికి ప్రణాళికలు వేసుకున్నారు.

ఇదొక సైన్స్ ఫిక్షన్ మూవీ కాగా.. బాలీవుడ్ స్టార్లు అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే కీలక పాత్రలకు ఎంపికయ్యారు. ఐతే ఈ సినిమాను ముందే అనౌన్స్ చేసినప్పటికీ.. వీటి తర్వాత ప్రకటించిన ఆదిపురుష్, సలార్ చిత్రాలకే ప్రభాస్ ప్రయారిటీ ఇచ్చాడు. వాటి చిత్రీకరణలోనే ముందు పాల్గొన్నాడు. ఇప్పటికే ‘ఆదిపురుష్’ చిత్రీకరణ కూడా పూర్తి చేసేసిన ప్రభాస్.. ‘సలార్’ కొత్త షెడ్యూల్ చిత్రీకరణలో పాల్గొంటూ వచ్చాడు. 

ఐతే ఎంతో ఆసక్తి రేకెత్తిస్తున్న నాగ్ అశ్విన్ సినిమాను ప్రభాస్ ఎప్పుడు మొదలుపెడతాడా అని అంతా ఎదురు చూస్తూ వచ్చారు. ఎట్టకేలకు ప్రభాస్‌ ఈ సినిమా పని ఆరంభించాడు. ‘ప్రాజెక్ట్ కే’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇప్పటికే సెట్స్ మీదికి వెళ్లింది. కొన్ని రోజుల కిందటే హీరోయిన్ దీపికా పదుకొనే చిత్రీకరణకు హాజరైంది. కొన్ని నెలల ముందే అమితాబ్ బచ్చన్ మీద కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు.

ఇప్పుడు ఎట్టకేలకు ప్రభాస్ రంగంలోకి దిగాడు. ఈ సినిమా కోసం ప్రభాస్ సరికొత్త లుక్‌లోకి మారబోతున్నాడట. ఈ సినిమా ఒక కొత్త ప్రపంచంలో నడుస్తుందని.. ఇందులో కనిపించే ప్రతి వస్తువూ కొత్తగా ఉంటుందని.. అలాగే ఇందులో కనిపించే వాహనాలు కూడా ఎక్కడా చూడని విధంగా ఉంటాయని.. ఇవన్నీ సిద్ధం చేయడానికి ప్రి ప్రొడక్షన్‌కు చాలా టైం పడుతోందని దర్శకుడు నాగ్ అశ్విన్ ఇంతకుముందే వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం 2023లో రిలీజవుతుందని అంచనా వేస్తున్నారు.