జగన్ మరో యూ టర్న్

YS Jagan Mohan Reddy
YS Jagan Mohan Reddy

పాలకులు నిర్ణయాలు తీసుకునేటప్పుడు బాగా ఆలోచించి తీసుకోవాలి. తొందరపాటుతో నిర్ణయాలు తీసుకోవడం తర్వాత నాలుక్కరుచుకుని నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవటం మంచిదికాదు. ఇపుడిదంతా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మహిళా పోలీసుల నియామకాలపై వెనక్కు తగ్గింది కాబట్టే. గతంలో గ్రామ, వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శులుగా ప్రభుత్వం 15 వేల మందిని నియమించింది. తర్వాత వీళ్లందరినీ మహిళా పోలీసులుగా మార్చాలని డిసైడ్ చేసింది.

జగన్ అనుకున్నదే ఆలస్యమని ఈ 15 వేల మందిని పోలీసు శాఖలోకి మారుస్తు జీవో 59 రిలీజ్ కూడా చేసేసింది. సీన్ కట్ చేస్తే ఇపుడా జీవోను ఉపసంహించుకోబోతోంది. ఎందుకు ఉపసంహరించుకుంటోంది ? ఎందుకంటే అనుకున్న వాళ్ళని అనుకున్నట్లు పోలీసు శాఖలోకి మార్చేయలేరన్న విషయం అప్పట్లో జగన్ కు తెలీదేమో. పోలీసు శాఖలో ఉద్యోగాలు భర్తీ చేయాలంటే దానికి పద్దతుంటుంది. కానీ ఆ పద్దతినేమీ పాటించకుండానే తాను అనుకున్నాను కాబట్టి మహిళా సంరక్షణ కార్యదర్శులంతా పోలీసులే అంటే ఎలా సాధ్యమవుతుంది ?

జగన్ నిర్ణయంపై ఎవరో కోర్టులో కేసు వేశారు. కోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దాదాపు చెల్లదని తేలిపోయింది. ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టు కొట్టేస్తుందని అర్ధమైపోయింది. దాంతో వెంటనే తాము రిలీజ్ చేసిన జీవోను ఉపసంహరించుకుంటున్నామని, తమ నిర్ణయాన్ని వాపసు తీసుకుంటున్నట్లు హైకోర్టుకు ప్రభుత్వం చెప్పింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే నిర్ణయం మంచిదే అయినా దాని అమలుకు ఓ పద్దతుంటుంది.

అసలే జగన్ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేయటానికి ప్రతిపక్షాలు రెడీగా ఉన్నాయి. ఇప్పటికే చాలా నిర్ణయాలపై కోర్టులో విచారణలు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో ఒక నిర్ణయం తీసుకునేముందు ప్రభుత్వం ఎంత ఆలోచించాలి ? ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు న్యాయ సమీక్షలో నిలబడేట్లుండాలన్న కనీస ఇంగితం లోపించటమే ఆశ్చర్యంగా ఉంది. ముందు నిర్ణయం తీసేసుకోవటం తర్వాత వెనక్కు తగ్గటం ప్రభుత్వానికి మంచిది కాదు.

ఈ మధ్యనే మూడు రాజధానుల చట్టాన్ని కూడా ఉపసంహరించుకుంటున్నట్లు హైకోర్టులో పిటిషన్ వేసింది. చట్టంలోని లోపాలను సవరించి సమగ్రమైన చట్టంతో మళ్ళీ వస్తామని కోర్టుకు ప్రభుత్వం చెప్పటమే విచిత్రం. తాము చేసిన చట్టంలో లోపాలుండకూడదన్న జ్ఞానం ప్రభుత్వంలో లోపించటమే ఆశ్చర్యంగా ఉంది. లొసుగులతోను, తప్పులతోను చట్టాలు చేయటం ఎందుకు ? తర్వాత వాటిని సవరించుకుని కొత్త చట్టం తెస్తామని కోర్టులో చెప్పటమెందుకు ? చేసే చట్టమేదో లోపాలు, తప్పులు లేకుండా ముందే చేయచ్చు కదా ?