మనసు విప్పి మాట్లాడుకున్న CBN – దగ్గుబాటి

దశాబ్దాల పాటు దూరంగా ఉన్న నారా, దగ్గుబాటి కుటుంబాలు ఒకే వేదికపై సందడి చేశాయి. ఓ శుభకార్యంలో ఈ రెండు కుటుంబాలు ఒకే వేదికను పంచుకున్నాయి. ఈ కుటుంబాల మద్య ఉన్న ఎడబాటును మరిచిపోయి ఆత్మీయంగా పలకరించుకున్నారు. ఎడముఖం పెడముఖంగా ఉన్న ఎన్టీఆర్ అల్లుళ్లు చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు కలుసుకున్నారు. అంతేకాదు ఇద్దరూ పక్క పక్కనే నిల్చోని ఫొటోలకు ఫోజులిచ్చారు. ఈ రెండు కుటుంబాల కలయికతో నందమూరి కుటుంబం ఉబ్బితబ్బివుతోంది. ఎన్టీఆర్ చిన్న కుమార్తె ఉమమహేశ్వరి కుమార్తె వివాహ వేడుక హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. పెళ్లి వేడుకలో భాగంగా పెళ్లి కుమార్తెను చేసే కార్యక్రమం కన్నుల పండుగగా సాగింది. ఈ వివాహ వేడుకకు నారా, దగ్గబాటి, నందమూరి కుటుంబ సభ్యులు, బంధువులు సందడి చేశారు. ఈ కార్యక్రమం నారా, దగ్గుబాటి కుటుంబాలను ఏకం చేసింది.

చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆత్మీయంగా పలకరించుకున్నారు. ఈ రెండు కుటుంబాలు ఆప్యాయంగా పలకరించుకుని మనసు విప్పి మాట్లాడుకున్నాయి. చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురందేశ్వరి, భువనేశ్వరి చాలా రోజుల తర్వాత కలుసుకున్నారు. రెండు కుటుంబాల ఆత్మీయ పలకరింపులను అతిథులు ఆసక్తిగా గమనించారు. పెళ్లి కుమార్తెకు అటుఇటుగా చంద్రబాబు, వెంకటేశ్వరరావు, పురందేశ్వరి, భువనేశ్వరి ఫొటోలు దిగారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చంద్రబాబు, వెంకటేశ్వరరావు కలయిక రాజకీయాల్లో కొత్త అంకానికి తెర తీశారని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇది మంచి పరిణామని టీడీపీ నేతలు సంబరపడుతున్నారు. 1995లో చంద్రబాబు సీఎం అయ్యేవరకు రెండు కుటుంబాల మధ్య సత్సంబంధాలే ఉన్నాయి.

ఆ తర్వాత రెండు కుటుంబాల మధ్య విభేదాలు వచ్చాయి. ఇక అప్పటి నుంచి దూరంగా ఉంటున్నారు. ఆ తర్వాత వెంకటేశ్వరరావు, పురందేశ్వరి కాంగ్రెస్ లో చేరారు. ఎంపీగా గెలిచిన పురందేశ్వరి, యూపీఏ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోవడం.. రాష్ట్రంలో కాంగ్రెస్ కనుమరుగు అవ్వడంతో ఆమె బీజేపీలో చేరారు. ప్రస్తుతం ఆమె బీజేపీలో జాతీయ నేతగా కొనసాగుతున్నారు. ఇక వెంకటేశ్వరరావు ఆయన కుమారుడు హితేష్ చెంచురాం 2019లో వైసీపీలో చేరారు. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పర్చూర్ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. హితేశ్‌కు అమెరికా పౌరసత్వం ఉంది. ఇదే అంశాన్ని టీడీపీ బలంగా ప్రచారం చేసింది. అందువల్లే ఆయన ఓడిపోయారని చెబుతున్నారు. ఈ తర్వాత ఏమైందో ఏమోగాని తండ్రీకొడుకులిద్దరూ వైసీపీకి దూరంగా ఉంటున్నారు.

ఇటీవల అసెంబ్లీలో భువనేశ్వరిపై వైసీపీ ఎమ్మెల్యేలు చేసిన అనుచిత వ్యాఖ్యలను నందమూరి కుటుంబం కంటే ముందుగా పురందేశ్వరి ఖండించారు. తన సోదరి భువనేశ్వరి వ్యక్తిత్వాన్ని హననం చేసేందుకు ప్రయత్నించడంపై తీవ్రంగా మనస్తాపం చెందినట్లు పురందేశ్వరి తెలిపారు. తానూ, తమ సోదరి నైతిక విలువలతో పెరిగామని, ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని పురందేశ్వరి స్పష్టం చేశారు. అయితే ఇప్పుడు అనూహ్యంగా చంద్రబాబు, వెంకటేశ్వరరావు కలుసుకోవడం రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీస్తోంది. గతంలో నందమూరి కుటుంబంలో అనేక శుభకార్యాలు జరిగాయి. ఈ వేడులకు నారా, దగ్గుబాటి కుటుంబాలు హజరయ్యేవి. ఈ కుటుంబాలు కలుసుకున్న సందర్భాలు లేవు. చంద్రబాబు, వెంకటేశ్వరరావు అటుంచితే.. పురందేశ్వరి, భువనేశ్వరి మధ్య కూడా మాటల్లేవు. ఈ సారి మాత్రం రెండు కుటుంబాల మధ్య మాటలు కలవడం, ఆత్మీయంగా పలకరించుకోవడం గమనార్హం. భువనేశ్వరిపై అసెంబ్లీ జరిగిన పరిణామాలు.. ఆ తర్వాత చంద్రబాబు భావోద్వేగం ఇవన్నీ ఏకకాలంలో జరిగిపోయాయి. రెండు కుటుంబాల కలయిక వెనుక చంద్రబాబు మంత్రాంగం ఉందనే విమర్శలు కూడా వస్తున్నాయి.