వైసీపీ ర్యాలీలో ‘జై బాలయ్య’

బాలయ్య అభిమానులెవరూ నందమూరి సింహపై తమకున్న అభిమానాన్ని దాచుకోలేరు. జై బాలయ్య అని మనసారా అనకుండా ఉండలేదు. అదే వారికి తారకమంత్రం.. పాపం.. వైఎస్‌ఆర్ విద్యార్ధి విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో ఓ విద్యార్థి బాలయ్యపై ఉన్న అభిమానాన్ని దాచుకోలేక తడబడి చివరికి బోర్లాపడ్డాడు. ర్యాలీలో పాల్గొన్న విద్యార్థి, వైసీపీ-టీడీపీ వైరం కూడా మర్చిపోయి ప్రత్యర్థి పార్టీ నాయకుడు నందమూరి బాలకృష్ణ పేరెత్తాడు. జై బాలయ్యా అంటూ అలవాటులో పొరపాటుగా అనేశాడు. ఇంకేముందు ర్యాలీలో పాల్గొన్న అందరూ బిత్తరపోయారు. 

మూడు రాజధానులకు మద్దతుగా వైసీపీ నాయకుడు, ఏపీ ఆగ్రోస్‌ చైర్మన్‌ నవీన్‌నిశ్చల్‌ సూచనలతో హిందూపురంలో వైఎస్‌ఆర్‌ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో గురువారం హిందూపురంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని విజయవంతం చేసేందుకు వివిధ కళాశాల నుంచి విద్యార్థులను సమీకరించారు. ర్యాలీ ప్రారంభానికి ముందే మూడు రాజధానులు కావాలంటూ నినాదాలు చేయాలని వైసీపీ నాయకులు విద్యార్థులకు సూచించారు.

విద్యార్థుల కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. హిందూపురంలోని చిన్నమార్కెట్‌ నుంచి అంబేద్కర్‌ సర్కిల్‌ మీదుగా ర్యాలీ సాగింది. అయితే ఇక్కడే కథ అడ్డం తిరిగింది. ఓ విద్యార్థి మాత్రం వారి మాట కాదని జై బాలయ్య అంటూ నినాదాలతో హోరెత్తించారు. దీంతో నిర్వాహకులతో పాటు విద్యార్థులు కంగుతిన్నారు. ర్యాలీ చూసినవారు ఆశ్చర్యానికి గురై వైసీపీ చేపట్టిన ర్యాలీలో బాలయ్య నినాదాలు ఏంటని చర్చించుకోవడం హిందూపురంలో హాట్‌టాపిక్‌గా మారింది. అంతేకాదు ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ర్యాలీ అనంతరం వైసీపీ నాయకులు తహసీల్దార్‌ కు వినతిపత్రం అందించారు. మూడు రాజధానులు ఏర్పాటు చేస్తే రాష్ట్రానికి ఎంతో ప్రయోజనమని వైసీపీ నేతలు చెప్పారు.

యువతకు ఉద్యోగం, ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెబుతున్నారు. అమరావతే రాజదానిగా కొనసాగించాలని అమరావతి కోసం భూములిచ్చిన రైతులు న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో పాదయాత్ర చేస్తున్నారు. ఈ పాదయాత్ర ప్రస్తుతం రాయలసీమలో కొనసాగుతోంది. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల మీదుగా చిత్తూరు జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు. రాయలసీమలో ఈ పాదయాత్రకు పెద్దగా మద్దతు వస్తున్నట్లు కనిపించడం లేదు. ఓ రకంగా చెప్పాలంటే మూడు రాజధానులతోనే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని ఇక్కడి మేధావుల అభిప్రాయం. అనేక సందర్భాల్లో ఇదే విషయాన్ని వివిధ రూపాల్లో వ్యక్తం చేస్తున్నారు.