జగన్ కి బ్యాడ్ న్యూస్ చెప్పిన కేంద్రం

“సార్‌! ఏపీలోని నాలుగు జిల్లాలు అత‌లాకుత‌లం అయ్యాయి. వెంట‌నే స్పందించి వెయ్యి కోట్టు సాయం చేయండి!“ అని సీఎం జ‌గ‌న్‌.. కేంద్రంలోని న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వానికి లేఖ‌లు రాసి.. దాదాపు మూడు వారాలు గ‌డిచిపోయింది. అయినప్ప‌టికీ.. కేంద్రం రాష్ట్ర విప‌త్తుల నిధులు వాడుకోండి..అని అప్ప‌ట్లోనే స‌మాధానం చెప్పింది. అయితే.. ఈ విష‌యాన్ని ప్ర‌స్తుతం జ‌రుగుతున్న పార్ల‌మెంటు స‌మావేశాల్లో.. వైసీపీ ఎంపీలు నిత్యం కేంద్రం దృష్టికి తీసుకువెళ్తున్నారు. దీంతో కేంద్రం పార్ల‌మెంటు వేదిక‌గా.. కుండ‌బ‌ద్ద‌లు కొట్టింది. సాయం కోసం వెయిట్ చేయాల్సిందే! అని తేల్చి చెప్పంది. అంతేకాదు.. అస‌లు మీరు చెప్పింది నిజ‌మో.. కాదో తేల్చుకున్నాకే.. సాయం చేస్తామ‌ని స్ప‌ష్టం చేసింది.

గత నెలలో క‌డ‌ప‌, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో  భారీ వర్షాలు, వరదల కార‌ణంగా అపార న‌ష్టం జ‌రిగింది. దీంతో సీఎం జ‌గ‌న్ సాయం చేయాల‌ని కేంద్రాన్ని అభ్య‌ర్థించారు. అయితే..కేంద్రం ఇప్ప‌టికీ స్ప‌ష్ట‌మైన హామీ ఇవ్వ‌లేదు. దీంతో ఈ విష‌యాన్ని వైసీపీ ఎంపీలు పార్ల‌మెంటు ఉభ‌య స‌భ‌ల్లోనూ లేవ‌నెత్తుతున్నారు. ఈ క్ర‌మంలో స్పందించిన కేంద్రం  కేంద్ర బృందం నివేదిక సమర్పించిన అనంతరం అదనపు ఆర్థిక సహాయం అందించే విషయాన్ని పరిశీలిస్తామని రాజ్యసభలో  వెల్లడించింది.

భారీ వర్షాలు, వరదల కారణంగా 25 మంది మరణించినట్లు, రోడ్లు, విద్యుత్‌ వ్యవస్థతోపాటు పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగినట్లు ఏపీ ప్రభుత్వం తెలిపిందని కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ చెప్పారు. భారీ వర్షాలపై నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం నవంబర్‌ 23న వివిధ మంత్రిత్వ శాఖలకు చెందిన ఉన్నతాధికారులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసిందన్నారు. ఈ బృందం నవంబర్‌ 26 నుంచి 29 వరకు భారీ వర్షాల ప్రభావానికి గురైన ప్రాంతాలను సందర్శించి జరిగిన నష్టాన్ని మదింపు చేసిందని, దీనిపై ఆ బృందం తుది నివేదిక సమర్పించిన అనంతరం ఏపీ ప్ర‌భుత్వం చెప్పిన విష‌యాల‌కు వాస్త‌వాల‌కు స‌రిపోల్చుకుని నిబంధనల ప్రకారం  సహాయం అందించే అంశాన్ని పరిశీలిస్తామ‌న్నారు.

ఏ విపత్తును కూడా జాతీయ విపత్తుగా ప్రకటించే అధికారం ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఎన్‌డీఆర్‌ఎఫ్‌కు ఉండదని నిత్యానంద్‌ రాయ్‌ స్పష్టం చేశారు. విపత్తులు సంభవించినప్పుడు బాధితులను ఆదుకోవలసిన ప్రాధమిక బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపైనే ఉంటుందని అన్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు ప్రజలకు సహాయ చర్యలు చేపట్టడానికి రాష్ట్ర విపత్తుల ప్రతిస్పందన నిధి అందుబాటులో ఉంటుందని, విపత్తు తీవ్రతరమైనదిగా కేంద్ర బృందం నివేదికలో పేర్కొంటే జాతీయ విపత్తుల ప్రతిస్పందన నిధి నుంచి రాష్ట్రానికి అదనంగా ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందన్నారు. ఈ విష‌యంలో ఏపీ ప్ర‌భుత్వం, బాధితులు వెయిట్ చేయాల్సిందేన‌ని వైసీపీ ఎంపీల‌కు చుర‌క‌లు అంటించారు.