మోడీకి తన గ్రాఫ్ పడిపోతోందని అర్థమైందా ?

చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. లేకపోతే పార్లమెంటుకు ఎంపీలు హాజరవ్వాలని, పార్లమెంట్ లో జరిగే చర్చల్లో సక్రమంగా పాల్గొనాలని ఎంపీలకు క్లాసు ఎందుకు పీకుతారు ? ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎంపీల వైఖరిపై ప్రధాని చాలా సీరియస్ అయ్యారు. చాలామంది ఎంపీలు అసలు పార్లమెంటుకే హాజరు కావడం లేదని తన అసహనాన్ని వ్యక్తంచేశారు. ఎంపీలందరూ పార్లమెంటు సమావేశాలకు క్రమం తప్పకుండా హాజరవ్వాలని చిన్నిపిల్లలకు చెప్పినట్టు ఎన్నిసార్లు చెప్పాలంటు మండిపోయారు. పార్లమెంటుకు గైర్హాజరయ్యే ఎంపీలకు వచ్చే ఎన్నికల్లో టికెట్లిచ్చేది లేదని కూడా వార్నింగ్ ఇచ్చారు.

నిజానికి పార్లమెంటు సమావేశాలకు హాజరవ్వమని మోడీ తన ఎంపీలకు చెప్పాల్సిన పనేలేదు. ఎందుకంటే ఎంపీలుగా ఎన్నికైందే పార్లమెంటుకు హాజరై తమ నియోజకవర్గాల్లోని సమస్యలను ప్రస్తావించి పరిష్కరిస్తారని.  మరి మౌలిక బాధ్యతల నుండి ఎంపీలు పక్కకు వెళ్ళిపోతే ఇక ఎంపీలుగా ఉండటం దేనికి ? వారు తీసుకునే జీత, బత్యాలు, సౌకర్యాలన్నీ ప్రజలు చెల్లించే పన్నుల నుండే కదా అందుతున్నది. ఇదే విషయాన్ని బహుశా మోడీ కూడా ఎంపీలకు గుర్తు చేసినట్లున్నారు.

ఎంపీల ప్రవర్తనలో మార్పు రాకపోతే లేదంటే మార్పులు వాటంతట అవే వచ్చేస్తాయని చాలా సీరియస్ గానే వార్నింగ్ ఇచ్చారు. అంతా బాగానే ఉంది కానీ  అసలు ఎంపీలకు మోడీ వార్నింగ్ ఇవ్వాల్సినంత అవసరం ఎందుకొచ్చింది ? ఎందుకంటే మోడీ చెప్పినా ఎంపీలు వినటం లేదు కాబట్టే. ఎంపీలందరూ క్రమం తప్పకుండా పార్లమెంటు సమావేశాలకు హాజరవ్వాలని మోడీ చెప్పడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా చాలాసార్లు చాలా గట్టిగానే చెప్పారు. అయినా ఎంపీలు వినటం లేదంటే అర్థమేంటి ?

ఏమిటంటే పార్టీపై మోడీ పట్టు జారి పోతోందనే అనుకోవాలి. ఈ మధ్యనే జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు ఉపఎన్నికల్లో బీజేపీ ఓడిపోవటం, పశ్చిమ బెంగాల్ లో ఎంత ప్రయత్నించినా మమతా బెనర్జీని ఓడించలేకపోవటం తదితరాల వల్ల మోడీ గ్రాఫ్ పడిపోతోందట. అలాగే ఉత్తర ప్రదేశ్ లో జరుగుతున్న పరిణామాలు పార్టీకి ఏ మాత్రం ఆశాజనకంగా లేవని అర్థమైపోతోంది. తొందరలో జరగబోయే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గనుక ఓడిపోతే మోడీకి ఇబ్బందులు మొదలైనట్లే అనుకోవాలి.

వీటన్నింటికీ అదనంగా ఆ మధ్య యూపీలో జరిగిన స్ధానిక సంస్ధల ఎన్నికల్లో సొంత నియోజకవర్గం వారణాశిలోనే బీజేపీ చాలా చోట్ల ఓడిపోయింది. ఇక యూపీలో బీజేపీ నేతలపై స్థానికులు ఎక్కడికక్కడ తిరగబడుతున్నారు. ఇలాంటి అనేక ఘటనలతో మోడీపై జనాల్లో వ్యతిరేకత పెరిగిపోతోందనే ప్రచారం బాగా పెరిగిపోతోంది. దీనికితోడు మోడీ పార్లమెంటు సమావేశాలకు హాజరైనా ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానాలు చెప్పటంలో బాగా ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి అనేక కారణాలతో మోడీ గ్రాఫ్ పడిపోతోందని అందుకనే ఎంపీలు కూడా లెక్కచేయటం లేదని సమాచారం.