రిలీజ్ అందుకే ఆపేశారా?

మానాడు.. పది రోజులుగా తమిళనాట సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న సినిమా. ఎప్పుడూ వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే శింబు.. వెరైటీ సినిమాలు తీసే వెంకట్ ప్రభు కలిసి చేసిన ఈ చిత్రం వివిధ కారణాలతో వాయిదాల మీద వాయిదాలు పడి ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజ్ ముందు ఇది ఏమాత్రం ఆడుతుందో అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి కానీ.. దీనికి అదిరిపోయే టాక్ వచ్చింది.

అంచనాలను మించిపోయిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సాధించింది. రెండో వారంలోనూ మంచి కలెక్షన్లతో దూసుకెళ్తోందా చిత్రం. శింబు కెరీర్లో ఇదే బిగ్గెస్ట్ హిట్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టైమ్ లూప్ కాన్సెప్ట్‌ను చాలా కొత్తగా, వినోదాత్మకంగా ప్రెజెంట్ చేసిన తీరుకు అందరూ ఫిదా అయిపోతున్నారు.

శింబు, ఎస్‌.జె.సూర్య పెర్ఫామెన్స్ అదుర్స్ అని అంటున్నారు. నిజానికి ఈ చిత్రాన్ని తమిళంతో పాటే తెలుగులోనూ రిలీజ్ చేయాలనుకున్నారు. ‘ది లూప్’ అనే టైటిల్ పెట్టి తెలుగు ట్రైలర్ కూడా లాంచ్ చేశారు. నవంబరు 25న తమిళంలో ఈ చిత్రం రిలీజ్ కాగా.. తర్వాతి రోజు తెలుగులో విడుదలకు సన్నాహాలు చేశారు. శింబు వచ్చి ఇక్కడ సినిమాను ప్రమోట్ చేశాడు కూడా. కానీ షెడ్యూల్ ప్రకారం ఈ చిత్రం తెలుగులో రిలీజ్ కాలేదు. తమిళంలో మంచి టాక్ తెచ్చుకున్న ఈ చిత్రాన్ని తెలుగులో అసలు పోటీ లేని టైంలో రిలీజ్ చేస్తే రెస్పాన్స్ బాగుండేదేమో. కానీ ఉన్నట్లుండి రిలీజ్ ఆపేశారు.

తమిళంలో తొలి రోజు అదిరిపోయే టాక్ రావడంతో వివిధ భాషల నుంచి రీమేక్ ఆఫర్లు రావడంతో తెలుగు డబ్బింగ్ రిలీజ్‌ను ఆపేసినట్లు తెలుస్తోంది. శింబుకు తెలుగులో ఇప్పుడు పెద్దగా మార్కెట్ లేకపోవడం, సినిమాకు బజ్ తక్కువగా ఉండటంతో నామమాత్రపు వసూళ్ల కోసం డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ చేయడం కన్నా మంచి రేటుకు రీమేక్ హక్కులు అమ్ముకోవడం మంచిదని ఆపినట్లు తెలుస్తోంది. సాయిధరమ్ తేజ్ హీరోగా ఈ చిత్రాన్ని రీమేక్ చేయడానికి ఓ నిర్మాత ప్రయత్నిస్తున్నట్లు కూడా వార్తలొస్తున్నాయి. వేరే వాళ్లు కూడా పోటీలో ఉన్నారట. త్వరలోనే రీమేక్ సంగతి తేలిపోతుందని అంటున్నారు.