జగన్ హిట్ సాంగ్ ను తెగ వాడేస్తోన్న టీడీపీ

ఏపీలో జరిగిన 2019 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ఓ పాట మార్మోగిపోయిన సంగతి తెలిసిందే. ‘రావాలి జగన్.. కావాలి జగన్.. మన జగన్..’ అంటూ వైసీపీ నేతలు ఆ పాటతో ప్రచారాన్ని హోరెత్తించారు. ఫిదా ఫేమ్ శక్తికాంత్ కార్తిక్ సంగీతం అందించిన ఈ పాట యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ సాధించిన ఏకైక పొలిటికల్ చార్ట్ బస్టర్ గా రికార్డు కూడా క్రియేట్ చేసింది. వాస్తవానికి కూడా, జనానికి జగన్ ను చేరువ చేయడంలో ఈ పాట కీలక పాత్ర పోషించిందని చెప్పవచ్చు.

కట్ చేస్తే…తాజాగా వైసీపీ అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్ల తర్వాత అదే పాటను టీడీపీ నేతలు తెగ వాడేస్తున్నారు. వైసీపీ అంటే మండిపడే టీడీపీ నేతలు ఈ పాట వాడడమేంటి అనుకోకండి. జగన్ వైఫల్యాలపై, వైసీపీ నేతల తీరుపై సెటైరికల్ గా ఈ పాటను తెలుగు తమ్ముళ్లు ఓ రేంజ్ లో వాడేస్తున్నారు. జగన్ ను పొగుడుతూ ఆనాడు వైసీపీ నేతలు వీర లెవల్లో వాడిన ఆ పాటను…ఇపుడు జగన్ ను ట్రోల్ చేసేందుకు టీడీపీ నేతలు వాడుతుండడం విశేషం.

తాజాగా తెనాలి వైసీపీ ఎమ్మెల్యే అన్నాబత్తిన శివకుమార్‌పై సెటైర్ వేస్తూ టీడీపీ ట్విటర్ ఖాతాలో ఓ సెటైరికల్ సాంగ్ పోస్ట్ అయింది. పార్కులో ఓ బెంచీకి శివకుమార్ పెయింట్ వేయడంపై టీడీపీ నేతలు సెటైర్ వేశారు. అసెంబ్లీలో ఉత్త వెకిలి నవ్వులే కాదు..పార్కుల్లో బెంచీల్లాంటివి కూడా ఏర్పాటు చేయిస్తున్నారంటూ ట్రోల్ చేశారు. అంతేకాదు, శివకుమార్ చేతులమీదుగా ప్రారంభమైన ఈ భారీ ప్రాజెక్టు చూశాక… సారు తన రేంజ్ కి  ఏమాత్రం తగ్గట్లేదనిపిస్తోంది కదూ అంటూ ఎద్దేవా చేశారు. దీంతో, ఈ సెటైరికల్ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.