గిఫ్ట్ లు తీసుకొని ఇరుక్కుపోయిన హీరోయిన్లు!

చీటింగ్, మనీలాండరింగ్ కేసుల్లో సుఖేష్ చంద్రశేఖర్ ను అధికారులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అటువంటి వ్యక్తి నుంచి జాక్వెలిన్ ఫెర్నాండేజ్, నోరా ఫతేహి లాంటి హీరోయిన్లు భారీ ఎత్తున గిఫ్ట్ లు తీసుకున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తన ఛార్జ్ షీట్ లో పేర్కొంది. గత కొన్నాళ్లుగా ఈ వ్యవహారంలో ఈడీ విచారణను ఎదుర్కొంటోంది నటి జాక్వెలిన్. సుఖేష్ చంద్రశేఖర్ నుంచి ఈ బ్యూటీ కొన్ని విలువైన బహుమతులను పొందినట్లుగా ఈడీ పేర్కొంది.

సుఖేష్ చంద్రశేఖర్ కు వివాహం జరిగింది. అయినప్పటికీ జాక్వెలిన్ అతడితో క్లోజ్ గా ఉంది. వీరిద్దరూ కలిసి తీసుకున్న ముద్దు సెల్ఫీలు బయటకు వచ్చాయి. ఇప్పుడు సుఖేష్ పై కేసులు విచారణ జరుగుతున్న నేపథ్యంలో.. జాక్వెలిన్ పేరు కూడా మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. సుఖేష్ తో జాక్వెలిన్ డేటింగ్ చేస్తుందనే విషయాన్ని సుఖేష్ తరఫు లాయర్ కోర్టుకు వెల్లడించారు. కానీ జాక్వెలిన్ మాత్రం ఈ విషయాన్ని అంగీకరించడం లేదు.

ఈ విషయం పక్కన పెడితే.. సుఖేష్ వద్ద నుంచి దాదాపు పది కోట్ల విలువైన బహుమతులను జాక్వెలిన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అందులో కొన్ని జంతువులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. రూ.50 లక్షల విలువైన ఓ గుర్రాన్ని జాక్వెలిన్ కి గిఫ్ట్ గా ఇచ్చాడట. అలానే ఓ పిల్లిని కూడా ఇచ్చాడట. దాని రేటు అక్షరాల పది లక్షలు.

మరో హీరోయిన్ నోరా ఫతేహి కూడా సుఖేష్ నుంచి గిఫ్ట్ లు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆమెకి కోటి రూపాయల విలువైన బహుమతులు ఇచ్చాడట సుఖేష్. వాటిలో ఐఫోన్, కారు ఉన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని సుఖేష్ స్వయంగా చెప్పాడట. దీంతో ఇప్పుడు నోరాను కూడా విచారిస్తున్నారు. మొత్తానికి సుఖేష్ నుంచి గిఫ్ట్ లు తీసుకొని అడ్డంగా బుక్కైపోయారు బాలీవుడ్ హీరోయిన్లు.