బీజేపీ సమస్యేంటో అర్థం కావటం లేదే ?

ఇపుడు అందరినీ పట్టి పీడిస్తున్న సమస్య ఇదే. కేంద్రంలో గడచిన ఏడున్నరేళ్ళుగా అధికారంలో ఉన్నా ఏపీలో మాత్రం కమలం పార్టీ పుంజుకోవడం లేదు. పక్కనున్న తెలంగాణలో పార్టీ మంచి ఊపు మీదున్నా ఏపీలో మాత్రం రోజురోజుకు కుదేలైపోతోంది. దీనికే కారణం ఏమిటనే విషయాన్ని నేతలు ఎంత ఆలోచించినా ఎవరికీ అర్థం కావడం లేదు. భవిష్యత్తులో కూడా ఇంతకన్నా పుంజుకుంటుందనే ఆశలు కూడా కనబడటం లేదు. దేశమంతా మోడి గాలిలో బీజేపీ మంచి ఫలితాలు సాధించినా ఏపీలో మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లుగా తయారైంది పార్టీ పరిస్ధితి.

ఒకపుడు పార్టీ కి ప్రతి ఊరిలోను ముగ్గురో లేకపోతే నలుగురో ఉండేవారంతే. కానీ ఇపుడు ప్రతిఊరిలోను పార్టీ తరపున సుమారు 40 మంది దాకా కనబడుతున్నారు. పెద్ద పట్టణాలు, జిల్లా హెడ్ క్వార్టర్స్ ల్లో అయితే ఇంకా ఎక్కువమందే కనబడుతున్నారు. అయితే ఎవరు కూడా పార్టీ గెలుపుకు సరిపడా ఓట్లను తేలేకపోతున్నారు. ప్రస్తుతం పార్టీలోని చాలామంది సీనియర్లలో బయట పార్టీల నుండి వచ్చి పెత్తనం చెలాయిస్తున్న వారే ఎక్కువగా కనబడుతున్నారు.

సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, పురందేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ, ఆది నారాయణరెడ్డి, లంకా దినకర్ లాంటి వాళ్ళ హడావుడే ఎక్కువగా కనబడుతోంది. అధ్యక్షుడిగా సోము వీర్రాజు ఉన్నా అనేక కారణాలతో ఆయన చేతులు కూడా కట్టేశారు. పైగా ఆయన కూడా జనాల్లో చెప్పుకోదగ్గ బలమున్న నేత కాదు. మొదటి నుండి బీజేపీలో ఉంటున్న నేతలు తాముంటున్న ప్రాంతాల్లో కూడా పలుకుబడున్న నేతలు కారు. దాంతో మధ్యలో వచ్చిన బయట పార్టీల నేతలదే హవా కనబడుతోంది.

పోనీ బయట పార్టీల నుండి వచ్చిన నేతలన్నా పార్టీని బలోపేతం చేస్తున్నారా అంటే అదీలేదు. ఎందుకంటే వీళ్ళల్లో జనాల్లో పలుకుబడున్న నేతలు కాదు. ఎంతసేపు తెరవెనుక మంత్రాంగం నడపగలిగిన వారే కానీ పట్టుమని పార్టీకి వంద ఓట్లు కూడా తేచ్చే కెపాసిటి లేదు. వీళ్ళల్లో చాలామందికి ఆర్ధిక బలమే కానీ జనబలం లేదని అందరికీ తెలిసిందే. మరి ఇపుడు ఏమి చేస్తే పార్టీ బలోపేతమవుతుందనేది పెద్ద సమస్యగా తయారైంది. ఇప్పటికిప్పుడు కాదు ఎన్నికలు ఎప్పుడు జరిగినా 175 నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి గట్టి అభ్యర్థులు దొరకరన్నది వాస్తవం.

ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో అభ్యర్ధులు దొరక్కే చాలా నియోజకవర్గాల్లో బీజేపీ పోటీనే చేయలేదు. పోటీచేసిన చోట్ల కూడా ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా రాలేదు. రాబోయే ఎన్నికల్లో కూడా సేమ్ సీన్ రిపీటవుతుందనటంలో సందేహమే లేదు. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అనే సామెతలో చెప్పినట్లుగా బీజేపీకి అసలైన సమస్య ఏమిటో అర్థం కావడం లేదు.