మహేష్‌ బాబు.. రెండు నెలలు ఇంట్లోనే

కరోనా సెకండ్ వేవ్ తర్వాత టాలీవుడ్ హీరోలందరూ షూటింగ్‌ల్లో బాగా బిజీ అయిపోయారు. కరోనా కారణంగా చాలా సమయం వృథా కావడంతో అదనపు సమయం పని చేస్తూ ఆలస్యమవుతూ వస్తున్న ప్రాజెక్టులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో శరీరం మీద ఎక్కువ ఒత్తిడి పడి గాయాల పాలవుతుండటం చూస్తున్నాం. టాలీవుడ్ స్టార్లలో జూనియర్ ఎన్టీఆర్ చేతికి గాయం కావడం.. బాలయ్యకు భుజంతో ఇబ్బంది తలెత్తడం తెలిసిందే. అందుకు వాళ్లిద్దరూ శస్త్ర చికిత్సలు కూడా చేయించుకున్నారు.

ఈ కారణాలతో కొత్త సినిమాలను వెంటనే మొదలుపెట్టలేని స్థితికి చేరుకున్నారు. ఇప్పుడు ఈ జాబితాలోకి మహేష్ బాబు కూడా చేరుతున్నట్లు సమాచారం. ఆయనకు ఎప్పట్నుంచో మోకాలి నొప్పి వేధిస్తుండగా.. ఇటీవల ఆ బాధ బాగా ఎక్కువైందట. ఈ నొప్పికి శాశ్వత పరిష్కారం చూపించుకోవడానికి మహేష్ బాబు రెడీ అయినట్లు తెలిసింది.మహేష్ మోకాలికి ఇంకొన్ని రోజుల్లోనే శస్త్ర చికిత్స జరగనుందట. హైదరాబాద్‌లోనే ఒక ప్రముఖ ఆర్థోపెడీషియన్ సర్జరీ చేయనున్నట్లు తెలిసింది. శస్త్ర చికిత్స అనంతరం మహేష్ రెండు నెలల పాటు ఇంటి నుంచి కదలబోడట. షూటింగ్స్ సహా అన్ని కార్యక్రమాలూ రద్దు చేసుకోనున్నాడట.

‘సర్కారు వారి పాట’కు సంబంధించి తన పార్ట్ షూట్ మొత్తం పూర్తి చేశాక మహేష్ శస్త్ర చికిత్సకు వెళ్లనున్నట్లు తెలిసింది. మహేష్ మామూలుగానే ఒక సినిమా పూర్తి చేశాక కొంత గ్యాప్ తీసుకుంటాడు. హాలిడే ట్రిప్‌కు వెళ్లి వచ్చాక కొత్త సినిమాను మొదలుపెడుతుంటాడు. ‘సర్కారు వారి పాట’ తర్వాత తన కొత్త సినిమాను త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో మహేష్ చేయాల్సి ఉంది. ప్రస్తుతం త్రివిక్రమ్ ‘భీమ్లా నాయక్’ పనిలో బిజీగా ఉన్నాడు. దాని రిలీజ్ తర్వాత మహేష్ సినిమా స్క్రిప్టుకు తుది మెరుగులు దిద్ది ఫిబ్రవరి లేదా మార్చిలో ఈ సినిమాను సెట్స్ మీదికి తీసుకెళ్లే అవకాశముంది. ఈలోపు మహేష్ శస్త్ర చికిత్స, విశ్రాంతి కాలం పూర్తవుతాయి.