కేసీయార్-పీకే బృందం మధ్య భేటీ ?

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ప్రగతి భవన్లో కేసీయార్ తో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బృందం భేటీ అయ్యిందట. గతంలోనే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, కేసీయార్ కొడుకు కేటీఆర్-పీకే మధ్య భేటీ జరిగిన విషయం అందరికీ తెలిసిందే. సో తాజాగా పీకే బృందంతో కేసీయార్ భేటీ అయ్యారనే విషయాన్ని చాలామంది నమ్ముతున్నారు. గడచిన ఏడేళ్ళలో ప్రభుత్వం తీసుకున్న రాజకీయపరమైన నిర్ణయాలు, విధానపరమైన నిర్ణయాలపై కేసీయార్ చర్చించారట.

తమ ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక పథకాలు, తీసుకుంటున్న నిర్ణయాలపై జనాలు ఏ విధంగా స్పందిస్తున్నారు, పథకాలు వాస్తవంగా ఎంతమందికి రీచవుతున్నాయి అనే అంశాలపై ఫీడ్ బ్యాక్ కావాలని కేసీయార్ పీకే బృందాన్ని కోరినట్లు సమాచారం. పనిలో పనిగా రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్ధితులపైన కూడా చర్చించారట. పార్టీ, ప్రభుత్వం తరపున పీకే బృందానికి పెద్ద క్వశ్చనియర్ ఇచ్చి అందులోని అంశాలపై డీటైల్డ్ గా సర్వే జరిపి ఫీడ్ బ్యాక్ ఇవ్వాలని కేసీయార్ కోరినట్లు తెలుస్తోంది.

ఒకవైపు బీజేపీ, మరోవైపు కాంగ్రెస్ అధ్యక్షులు బండి సంజయ్, రేవంత్ రెడ్డి సీఎంకు వ్యతిరేకంగా రెచ్చిపోతున్నారు. ఎన్నికలు ఎప్పుడు పెట్టినా తమదే అధికారం అంటు ఇద్దరూ నానా రచ్చ రచ్చ చేస్తున్నారు. ఒక విధంగా చూస్తే ఇద్దరు కూడా కేసీయార్ పై మైండ్ గేమ్ ఆడుతున్నారు. వీళ్ళ దెబ్బకు కేసీయార్ కూడా టెన్షన్ పడుతున్నట్లే ఉన్నారు. లేకపోతే నెలకు ఒకసారి కూడా మంత్రులు, ఉన్నతాధికారులను కలవటానికే ఇష్టపడని కేసీయార్ ఇపుడు వరుసగా మీడియా సమావేశాలు పెడుతున్నారు.

కేంద్రంపై దాదాపుగా యుద్ధం ప్రకటించారు. కేంద్రంపై యుద్ధానికి కేసీయార్ వరి కొనుగోలును ఆయుధంగా మార్చుకున్నారు. ఈ రాజకీయం, పోరాటం ఎంతకాలం చేయగలరో ? ఎంతగా వర్కవుటవుతుందో తెలీదు కానీ కొద్దిరోజులుగా కేసీయార్ అయితే జనాలందరికీ అందుబాటులో ఉంటున్నది వాస్తవం. ఈ ఘనత హుజూరాబాద్ ఉపఎన్నికలకే దక్కుతుందనటంలో సందేహం లేదు. ఎప్పుడైతే ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ అభ్యర్థి ఓడిపోయారో వెంటనే కేసీయార్ కళ్ళు తెరిచినట్లు అనుకోవాలి.

ఉపఎన్నికలో గెలుపుకు కేసీయార్ ఎంతచేయాలో అంతా చేశారు. అయినా జనాలు మాత్రం టీఆర్ఎస్ ను ఘోరంగా ఓడగొట్టారు. దీంతోనే కేసీయార్ మైండ్ బ్లాంక్ అయిపోయింది. దాంతో వెంటనే జనాల్లోకి రావటం, సమస్యల పరిష్కారినికి కేంద్రంపై యుద్ధమని హడావిడి చేస్తున్నారు. ఎలాగూ తొందరలోనే ముందస్తు ఎన్నికలు జరగటం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. కాబట్టే కేసీయార్ పీకే బృందంతో భేటీ జరిపినట్లు తెలుస్తోంది. వివిధ రాజకీయ పార్టీల పరిస్ధితి ఏమిటి ? టీఆర్ఎస్ గెలుపు అవకాశాలు ఎంత ? గెలవడానికి చేయాల్సిందేమిటి ? అనే అంశాలపై డీటైల్డ్ గా చర్చించినట్లు సమాచారం. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాల్సిందే.