ఇది కదా సిరివెన్నెలకు అసలు నివాళి

సీతారామ శాస్త్రి కాలం చేసి అప్పుడే ఒక రోజు దాటిపోయింది. ఆయనకు తెలుగు వాళ్లు గొప్ప నివాళే ఇస్తున్నారు. నిన్న సాయంత్రం నుంచి అన్ని రకాల మీడియాలోనూ ఆయన పాటలే మార్మోగుతున్నాయి. చాలా సరళమైన పదాలతో.. లోతైన అర్థంతో తన పాటల ద్వారా ఆయన పలికించిన అనేక రకాల భావాల గురించి.. ఆయన పాటల ఫిలాసఫీ గురించి అందరూ చర్చించుకుంటుండటం మంచి విషయం.

సిరివెన్నెల స్థాయికి తగినంత గుర్తింపు దక్కలేదని బాధ పడే త్రివిక్రమ్ లాంటి వాళ్లకు.. తెరచాటుగా ఉండిపోయిన సిరివెన్నెల అభిమానులెందరో బయటికొచ్చి ఆయన మీద తమ ప్రేమను చాటుకుంటుండటం.. వివిధ మార్గాల్లో ఆయనకు అక్షర నివాళి అర్పిస్తుండటం కచ్చితంగా సంతృప్తినిచ్చేదే. ఐతే తెలుగు వారు సీతారామశాస్త్రికి ఎంత ఘనమైన నివాళి అర్పించినప్పటికీ.. వేరే భాషల వాళ్లు మన దిగ్గజాన్ని పొగిడితే అది మనందరికీ గర్వకారణం.

స్వతహాగా కన్నడిగుడైన ప్రకాష్ రాజ్.. సీతారామశాస్త్రికి ఆయన పాట పల్లవితో నివాళి అర్పించడం అందరినీ ఆకట్టుకుంది. ఇక ఎన్నో ఏళ్ల పాటు సీతారామశాస్త్రితో కలిసి పాటల ప్రయాణం సాగించిన లెజెండరీ మ్యుజీషియన్ ఇళయరాజా తెలుగులో ఆయనకు అర్పించిన నివాళి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

సీతారామశాస్త్రికి స్థాయికి తగ్గట్లే సాహితీ విలువలతో.. ఆయన గొప్పదనాన్ని చాటేలా చక్కటి తెలుగులో ఆయన నోట్ రిలీజ్ చేయడం విశేషం. తాను చెప్పాలనుకున్న భావాన్ని వేరేవాళ్లతో రాయించారా.. ఆయన చెబుతుంటే రాశారా అన్నది పక్కన పెడితే.. ఒక తమిళుడు ఇలా ఒక తెలుగు కవికి తెలుగులో ఘనంగా నివాళి అర్పించడం మాత్రం విశేషమే. ఇంతకీ ఆ నోట్‌లో ఇళయరాజా ఏమన్నారంటే..

‘‘వ్యాపారాత్మక సినిమా పాటల్లో సైతం కళాత్మకతని, కవితాత్మని అందించి, అందమైన, అర్థవంతమైన,సమర్థవంతమైన పాటలని మన మెదళ్లలో నగంగలా ప్రవహింపచేసిన కవీశ్వరుడు సీతారాముడు. ఎన్నో సంవత్సరాల ప్రయాణం మాది. శ్రీ వేటూరి గారికి సహాయకుడిగా వచ్చి, అతి తక్కువ కాలంలో శిఖర స్థాయికి చేరుకున్న సరస్వతి పుత్రుడు. మా ఇద్దరి కలయికలో ఎన్నో పాటలు ప్రాణం పోసుకున్నాయి. తన పాటల పదముద్రలు నా హార్మోనియం మెట్లపై నాట్యం చేశాయి. రుద్రవీణ, స్వర్ణకమలం, బొబ్బిలిరాజా ఎన్ని సినిమాలు, ఎన్ని పాటలు.

రేపు రంగమార్తాండ కూడా. సీతారాముడు రాసిన పాటలకు నువ్వా నేనా అంటూ పోటీపడుతూ సంగీతాన్ని అందించిన సందర్భాలెన్నో. సీతారాముడు పాటతో ప్రయాణం చేస్తాడు. పాటతో అంతర్యుద్ధం చేస్తాడు. పాటలో అంతర్మథనం చెందుతాడు. పాటని ప్రేమిస్తాడు. పాటతో రమిస్తాడు. పాటని శాసిస్తాడు. పాటని పాలిస్తాడు. పాట నిస్తాడు. మన భావుకతకి భాషను అద్ది. మనకు తెల్సిన పాటలా చెవుల్లోకి ఒంపుతాడు. అందుకే సీతారాముడి పాటలు ఎప్పటికీ గుర్తుంటాయి. తన సాహిత్యం నాతో ఆనంద తాండవం చేయించాయి.

నాతో శివతాండవం చేయించాయి. వేటూరి నాకు తెలుగు సాహిత్యం మీద ప్రేమను పెంచితే, సీతారాముడు నాకు తెలుగు సాహిత్యం మీద గౌరవాన్ని పెంచాడు. ధన్యోస్మి మిత్రమా. ఇంత త్వరగా సెలవంటూ శివైక్యం చెందడం మనస్సుకు బాధగా ఉంది. పాటకోసమే బ్రతికావు. బ్రతికినంత కాలం పాటలే రాసావు. ఆ ఈశ్వరుడు నీకు సద్గతిని ప్రసాదించాలని కోరుకుంటున్నా’’ అంటూ ముగించారు ఇళయరాజా.