ఉభయసభల్లో ఎదురేలేదు

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఉభయసభల్లోను ఎదురన్నదే లేదు. తాజాగా శాసనమండలిలో వైసీపీ సభ్యుల బలం 32కి పెరిగింది. 58 మంది సభ్యులున్న మండలిలో వైసీపీకి 32 మంది ఉన్నారంటే మామూలు విషయం కాదు. మొన్నటివరకు మండలిలో బిల్లుల ఆమోదంలో అధికారపార్టీ ఎంతగా ఇబ్బంది పడిందో అందరు చూసిందే. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 151 సీట్ల అఖండ మెజారిటితో అధికారంలోకి వచ్చినా మండలిలో మైనారిటిలో ఉండటం వైసీపీ చాలా ఇబ్బందులే పడింది.

బిల్లుల ఆమోదం విషయంలో అసెంబ్లీలో ఏమీ చేయలేని టీడీపీ మండలిలో ఉన్న మెజారిటి కారణంగా ప్రతి బిల్లును అడ్డుకున్నది. నిజానికి బిల్లుల ఆమోదానికి అసెంబ్లీయే కీలకం. ఎందుకంటే ఒకసారి మండలిలో ఫెయిలైనా రెండోసారి మళ్ళీ ప్రవేశపెట్టి ఆమోదింపచేసుకునే అవకాశాలున్నాయి. అయితే ఆ వెసులుబాటు అసెంబ్లీలో లేదు. అసెంబ్లీలో 23 మంది మాత్రమే ఉన్న టీడీపీ బిల్లుల ఆమోదంలో ఏమీ చేయలేకపోతోంది. అందుకనే శాసనమండలిలో అడ్డుకుంటోంది.

ప్రభుత్వ స్కూళ్ళల్లో ఇంగ్లీషుమీడియం, మూడు రాజధానుల ఏర్పాటు, సీఆర్డీయే చట్టం రద్దు లాంటి బిల్లుల ఆమోదంలో మండలిలో అధికార-టీడీపీ సభ్యుల మధ్య ఎంతపెద్ద గొడవైందో అందరు చూసిందే. దాంతోనే మండలి రద్దుకు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం కూడా చేయించారు. ఆవేశంలో తీర్మానం చేయించినా ఆ తర్వాత వాస్తవ పరిస్ధితులను అంచనా వేసుకుని మండలి రద్దు తీర్మానంపై వెనకడుగువేశారు. మూడు రోజుల క్రితమే గతంలో చేసిన మండలి రద్దు తీర్మానాన్ని కూడా రద్దు చేసుకున్నారు.

తాజాగా స్ధానికసంస్ధల కోటాలో భర్తీ చేయాల్సిన 11 ఎంఎల్సీలు ఏకగ్రీవమైపోయాయి. అన్నీ స్ధానాల్లోను వైసీపీ ఏకపక్షంగా గెలుచుకుంది. దాంతో మండలిలో వైసీపీ బలం ఒక్కసారిగా 32కి పెరిగిపోయింది. 2023 చివరకు సభలో సభ్యుల బలం సుమారుగా 50కి చేరుకుంటుందని అంచనా వేసుకుంటున్నారు అధికారపార్టీ నేతలు. ఏదేమైనా ఉభయసభల్లో తమకు ఎదురన్నదే లేకపోవటం అధికారపార్టీ నేతల్లో ఫుల్లుగా జోష్ తో ఉన్నారు.

అయితే ఇక్కడే ఓ సమస్య కూడా ఉంది. అదేమిటంటే పంచాయితీ నుండి అసెంబ్లీ, మండలి దాకా అధికారపార్టీకి ఏకపక్షంగా బలం పెరిగిపోవటం ప్రజాస్వామ్యానికి అంత మంచిదికాదు. ఏకపక్షంగా దఖలుపడిన బలంతో చివరకు ప్రజాస్వామ్యాన్నే చిన్నచూపు చూసే అవకాశం కూడా ఉంది. ఎక్కడ కూడా తనకు ఎదురన్నదే లేదని పాలకులు  అనుకుంటే ప్రజాస్వామ్యానికి చాలా ఇబ్బంది అవుతుంది. పాలకులు కాస్త జాగ్రత్తగా ఉండేవాళ్ళయితే మంచిదే లేకపోతే మాత్రం చాలా సమస్యలు వస్తాయి.