ఒక్క‌ సినిమాకు 120 మంది గాయ‌కులా?

ఒక‌ప్పుడు ఒక మేల్ సింగ్, ఒక లేడీ సింగ‌ర్ క‌లిసి సినిమాలో మొత్తం పాట‌లు పాడేసేవారు. ఆ త‌ర్వాత సినిమాలో ఒక్కో పాట‌ను ఒక్కో సింగ‌ర్‌తో పాడించ‌డం మొద‌లైంది. ఇప్పుడు ఒక పాటనే ఇద్ద‌రు ముగ్గురు పాడే సంస్కృతి కూడా చూస్తున్నాం. ఐతే అలా సింగ‌ర్స్ సంఖ్య ఎంత పెరిగినా కూడా ఒక సినిమాకు మొత్తంగా మ‌హా అయితే ప‌ది మంది సింగ‌ర్స్ ప‌ని చేస్తే ఎక్కువ‌.

ఒక‌వేళ కోర‌స్ పాడే సింగ‌ర్స్‌ను కూడా క‌లిపితే ఈ సంఖ్య డ‌బులో ట్రిపులో కావ‌చ్చేమో. కానీ ఒక సినిమా కోసం ఏకంగా 120 మంది గాయ‌నీ గాయ‌కులు ప‌ని చేశారంటే న‌మ్మ‌గ‌ల‌మా? ఇది ఒక తెలుగు సినిమా విష‌యంలోనే జ‌రిగింది. ఆ సినిమా నంద‌మూరి బాల‌కృష్ణ-బోయ‌పాటి శ్రీనుల క‌ల‌యిక‌లో తెర‌కెక్కిన అఖండ కావ‌డం విశేషం. ఈ ఒక్క సినిమా కోసం 120 మంది సింగ‌ర్స్ ప‌ని చేసిన విష‌యాన్ని స్వ‌యంగా సంగీత ద‌ర్శ‌కుడు త‌మ‌న్ వెల్ల‌డించాడు.

ఇటీవ‌లే విడుద‌లై అంద‌రినీ ఆక‌ట్టుకున్న అఖండ టైటిల్ సాంగ్ కోసం ప‌దుల సంఖ్య‌లో సింగ‌ర్స్ ప‌ని చేసిన‌ట్లు త‌మ‌న్ వెల్ల‌డించాడు. మిగ‌తా పాట‌ల‌కు కూడా కోర‌స్ సింగ‌ర్స్ చాలా మంది అవ‌స‌రం ప‌డ్డార‌ని.. సినిమాలో ఒక్కో పాట కోసం ఇద్ద‌రు ముగ్గురు ప్ర‌ముఖ గాయ‌నీ గాయ‌కులు ప‌ని చేశార‌ని.. అలా మొత్తం సింగ‌ర్స్ సంఖ్య 120కి చేరింద‌ని త‌మ‌న్ తెలిపాడు. తాను క్వాలిటీ విష‌యంలో అస్స‌లు రాజీ ప‌డ‌న‌ని.. ఏ పాట ఎవ‌రు పాడాలో వారు పాడితేనే బాగుంటుంద‌ని.. అందుకే శివుడి మీద న‌డిచే అఖండ టైటిల్ సాంగ్‌ను శంక‌ర్ మ‌హ‌దేవ‌న్ పాడితేనే బాగుంటుంద‌ని ఆయ‌న్ని తీసుకొచ్చామ‌ని త‌మ‌న్ తెలిపాడు.

ఈ ఒక్క పాట‌కే నెల రోజుల స‌మ‌యం తీసుకున్నామ‌ని.. అఘోరాల గురించి ఎంతో రీసెర్చ్ చేసి ఈ సాంగ్ రికార్డ్ చేశామ‌ని త‌మ‌న్ వెల్ల‌డించాడు. అఖండ లాంటి సినిమా ఇండియ‌న్ స్క్రీన్ మీద రాలేద‌ని.. త‌న కెరీర్లోనే సంగీత ప‌రంగా టాప్‌లో ఉండే సినిమాల్లో ఇదొక‌ట‌ని త‌మ‌న్ అభిప్రాయ‌ప‌డ్డాడు.