మూడు రాజ‌ధానుల బిల్లుల‌ ర‌ద్దు.. ఏపీ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం

గ‌త రెండు సంవ‌త్స‌రాలుగా ఏపీలో తీవ్ర ఉత్కంఠ‌కు, ప్ర‌భుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌ల‌కు దారితీసిన‌.. మూడు రాజ‌ధానుల బిల్లును జ‌గ‌న్ ప్ర‌భుత్వం ర‌ద్దు చేసింది. దీంతో పాటు.. ఏపీ సీఆర్ డీఏ బిల్లును సైతం ర‌ద్దు చేసింది. తాజాగా ఈ విష‌యాన్ని రాష్ట్ర హైకోర్టుకు ప్ర‌భుత్వం తెలిపింది. మూడు రాజధానుల విషయమై సంచలన నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకుంటామని ఏపీ హైకోర్టుకు అడ్వకేట్ జనరల్‌ తెలిపారు. “వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ రద్దు బిల్లులను కేబినెట్‌ రద్దు చేసింది. చట్టం రద్దుపై కాసేపట్లో అసెంబ్లీలో సీఎం ప్రకటన చేస్తారు” అని అడ్వకేట్‌ జనరల్‌ కోర్టుకు వెల్లడించారు.

ప్ర‌స్తుతం రాష్ట్ర హైకోర్టులో మూడు రాజ‌ధానుల విష‌యంపై రైతులు, రైతు సంఘాలు, ప్ర‌జాస్వామ్య వాదులు దాఖ‌లు చేసిన పిటిష‌న్ల‌పై రోజు వారీ విచార‌ణ జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో తాజాగా జ‌రిగిన విచార‌ణ‌లో అడ్వొకేట్ జ‌న‌ర‌ల్‌.. తాజాగా ఈ విష‌యాన్ని కోర్టుకు తెలిపారు. మ‌రికొద్ది సేప‌ట్లోనే అసెంబ్లీలో ముఖ్య‌మంత్రి ఈ నిర్ణ‌యం ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంద‌ని తెలిపారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో పెద్ద హాట్ టాపిక్‌గా.. వివాదస్ప‌ద అంశంగా మారిన రాజ‌ధాని బిల్లుల వ్య‌వ‌హారానిక ప్ర‌భుత్వం ఫుల్ స్టాప్ పెట్టిన‌ట్టు అయింది.

అయితే, దీనికి సంబంధించిన పూర్తి స‌మాచారం రావాల్సి ఉంది. ప్ర‌స్తుతం కేంద్ర ప్ర‌భుత్వం రైతుల ఒత్తిడికి త‌లొగ్గి మూడు వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను వెన‌క్కి తీసుకున్న నేప‌థ్యంలో ఇప్పుడు.. రాష్ట్ర ప్ర‌భుత్వం కూడా ఈ నిర్ణ‌యం దిశ‌గా అడుగులు వేయ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. అయితే…. పూర్తిగా మూడు రాజ‌ధానులు ర‌ద్దు చేస్తారా? లేక‌.. ర‌ద్దు చేసినా.. వేరే రూపంలో ఏదైనా సంచ‌ల‌నానికి తెర‌దీస్తారా? అన్న‌ది వేచి చూడాలి. ఏదేమైనా..జ‌గ‌న్ స‌ర్కారు ఏదైతే.. సంచ‌ల‌నం అంటూ.. చెప్పుకొచ్చిందో.. దానివిష‌యంలో వెల్లువెత్తిన నిర‌స‌న‌ల‌కు వెన‌క్కిత‌గ్గ‌క త‌ప్ప‌లేదు.

మ‌రి మూడు ప్రాంతాల అభివృద్ధి కోస‌మే దీనిని తీసుకువ‌చ్చామ‌ని చెప్పిన ప్ర‌భుత్వం.. ఇప్పుడు వెన‌క్కి తీసుకోవ‌డం కూడా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఎందుకంటే.. క‌ర్నూలులో న్యాయ‌రాజ‌ధాని, విశాఖ‌లో పాల‌నారాజ‌ధాని అన్న ప్ర‌భుత్వం అక్క‌డి ప్ర‌జ‌ల‌కు ఆశ‌లు పెట్టింది. మ‌రి ఇప్పుడు అక్క‌డివారి ఎలాంటి స‌మాధానం చెబుతోందో అనేది కూడా ఆస‌క్తిగా మారింది. ఏదేమైనా. కూడా దూకుడు నిర్ణ‌యాలు స‌రైన‌వి కావ‌నేది మ‌రోసారి నిరూపిత‌మైందని అంటున్నారు ప‌రిశీల‌కులు.