వైసీపీలో సోమ‌వారం టెన్ష‌న్‌.. స‌ర్వ‌త్రా ఉత్కంఠ‌..!

అవును… ఇప్పుడు అంద‌రి దృష్టీ ఏపీ అసెంబ్లీ వైపే ఉంది. శుక్ర‌వారం జ‌రిగిన ప‌రిణామాల నేప‌థ్యంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. మీడియా ముందుకు రావ‌డం.. క‌న్నీరు పెట్ట‌డం.. ఇది నంద‌మూరి కుటుంబాన్ని కూడా క‌దిలించ‌డం.. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నిర‌స‌న‌లు రావ‌డం.. వంటి ప‌రిణామాలు తెలిసిందే.

ముఖ్యంగా నంద‌మూరి కుటుంబం మొత్తం ఏక‌మై.. స‌భా కార్య‌క్ర‌మాల‌పై విమ‌ర్శ‌లు చేయ‌డం.. టీడీపీ నాయ‌కులు తీవ్ర‌స్థాయిలో నిర‌స‌న వ్య‌క్తం చేయ‌డం.. అంద‌రినీ ఆలోచ‌న‌కు గురిచేసింది. ఈ నేప‌థ్యంలో రంగంలోకి దిగిన మంత్రులు పేర్నినాని, బాలినేని శ్రీనివాస‌రెడ్డి, క‌న్న‌బాబు వంటి వారు వివ‌ర‌ణ ఇచ్చారు.

అయిన‌ప్ప‌టికీ.. చంద్ర‌బాబు విష‌యంలో ర‌గిలిన చిచ్చు.. ఆరే ప‌రిస్థితి క‌నిపించ‌లేదు. దీనికితోడు.. ఆయ‌న చేసిన శ‌ప‌థం.. నేను సీఎం అయ్యే వ‌ర‌కు.. స‌భ‌లోకి అడుగుపెట్ట‌న‌న్న విష‌యం కూడా ఇంకా చ‌ర్చ‌నీయాశం గానే మారింది. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు.. వైసీపీ అధినేత‌, ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు అన్ని వైపుల నుంచి ఒకింత ఒత్తిడైతే పెరిగింది. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు జ‌గ‌న్ ఏం చేస్తారు? అనే చ‌ర్చ సాగుతోంది. ఈ క్ర‌మంలోనే అంద‌రి చూపూ.. అసెంబ్లీ వైపు ప‌డింది. శుక్ర‌వారం తీవ్ర వివాదంతో వాయిదా ప‌డిన స‌భ‌.. సోమ‌వారం ప్రారంభం కానుంది.

ఈ నేప‌థ్యంలో సోమ‌వారం ప్రారంభ‌మ‌య్యే స‌భ‌లో స్వ‌యంగా సీఎం జ‌గ‌నే ఈ వివాదంపై వివ‌ర‌ణ ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ఎందుకంటే..ఇప్ప‌టి వ‌ర‌కు చంద్ర‌బాబు విష‌యంలో నంద‌మూరి కుటుంబం పెద్ద‌గా స్పందించ‌లేదు. కానీ, భువ‌నేశ్వ‌రి విష‌యంలో వ‌చ్చిన వివాదం నేప‌థ్యంలో ఈ ఫ్యామిలీ ఒకింత భావోద్వేగంతోనే రియాక్ట్ అయింది. దీనికితోడు ఈ అంశంపై జ‌గ‌న్ ఏం చెబుతారో ఎదురు చూస్తున్నామంటూ ఎన్టీఆర్‌ కుటుంబ స‌భ్యులు వ్యాఖ్యానించారు.

ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వం ప‌క్షాన జ‌గ‌న్ చేసే కామెంట్లకు ప్రాధాన్యం ఏర్ప‌డింది. ఇక‌, రాజ‌కీయంగా కూడా జ‌గ‌న్‌పై మ‌ర‌క‌లు ప‌డుతున్న నేప‌థ్యంలో ఆయ‌న ఖ‌ఛ్చితంగా స్పందించి తీరుతార‌ని అంటున్నారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.