డిజాస్ట‌ర్ డైరెక్ట‌ర్.. మూడు క్రేజీ ప్రాజెక్ట్స్

‘స్వామి రారా’ మూవీతో త‌న‌పై భారీగా అంచ‌నాలు పెంచిన ద‌ర్శ‌కుడు సుధీర్ వ‌ర్మ‌. కానీ ఆ అంచ‌నాల‌ను త‌ర్వాతి సినిమాల‌తో అస్స‌లు అందుకోలేక‌పోయాడు. అత‌డి రెండో చిత్రం ‘దోచెయ్’ ఎంత పెద్ద డిజాస్ట‌ర్ అయిందో తెలిసిందే. ఆ త‌ర్వాత త‌న తొలి చిత్ర క‌థానాయ‌కుడు నిఖిల్‌తోనే ‘కేశ‌వ’ తీశాడు. దీన్ని ఫ్లాప్ అన‌లేం. అలా అని హిట్ అని కూడా చెప్ప‌లేం. ఏదో యావ‌రేజ్‌గా ఆడిందంతే. అయినా సుధీర్ వ‌ర్మ‌కు మ‌రో మంచి అవ‌కాశం వ‌చ్చింది.

శ‌ర్వానంద్ హీరోగా ‘రణరంగం’ లాంటి క్రేజీ మూవీని డైరెక్ట్ చేశాడు. ఈ చిత్రానికి కోరుకున్నదానికంటే ఎక్కువ హైపే వచ్చింది. కానీ ఏం లాభం? సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. ఇంకో డిజాస్టర్ సుధీర్ ఖాతాలో పడింది. ఈ ట్రాక్ రికార్డులో ఇంకో సినిమా అవకాశం అందుకోవడమే కష్టం. అలాంటిది సుధీర్ మూడు చిత్రాలను లైన్లో పెట్టాడు.

ఇంతకుముందు ‘మిస్ గ్రానీ’ అనే కొరియన్ మూవీని ‘ఓ బేబీ’ పేరుతో రీమేక్ చేసి సూపర్ హిట్ కొట్టిన సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ.. కొరియా నుంచే ఇంకో థ్రిల్లర్ యూవీని తెలుగులోకి తీసుకొస్తోంది. ‘శాకిని డాకిని’ పేరుతో రాబోతున్న ఈ చిత్రంలో రెజీనా కసాండ్రా, నివేథా థామస్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసింది సుధీరే. చడీచప్పుడు లేకుండా సినిమాను మొదలుపెట్టి చకచకా పూర్తి చేశాడు సుధీర్. ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.

ఇంతలో నిఖిల్‌తో మూడో సినిమాకు రంగం సిద్ధం చేశాడు సుధీర్. సీనియర్ ప్రొడ్యూసర్ బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఆల్రెడీ షూటింగ్ మొదలైపోయింది. కొత్త షెడ్యూల్ కోసం లండన్‌లో అడుగు పెట్టింది చిత్ర బృందం. ఇక సుధీర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ మూవీని ఇటీవలే అనౌన్స్ చేయడం తెలిసిందే. రవితేజ హీరోగా ‘రావణాసుర’ పేరుతో ఆ సినిమా తెరకెక్కనుంది. వరుసగా మూడు ఫెయిల్యూర్లు డెలివర్ చేసిన దర్శకుడికి స్వల్ప వ్యవధిలో మూడు సినిమాల్లో అవకాశం దక్కడం.. ఏడాది వ్యవధిలో ఆ మూడు చిత్రాలూ పూర్తి కాబోతుండటం విశేషమే.