ప‌వ‌న్‌ పై దిల్ రాజుకు ఎంత గురి అంటే..

ఒక సినిమా స‌త్తా ఏంటో స‌రిగ్గా అంచ‌నా వేసి స‌రైన రేటు పెట్టి సినిమాలు కొని డిస్ట్రిబ్యూట్ చేస్తాడ‌ని అగ్ర నిర్మాత‌, డిస్ట్రిబ్యూట‌ర్ దిల్ రాజుకు పేరుంది. ఒక‌ప్పుడు తెలుగు సినిమాల నైజాం మార్కెట్ ఎప్పుడూ 30 కోట్ల దాట‌ని టైంలో బాహుబ‌లి: ది కంక్లూజ‌న్ మీద ఆయ‌న ఏకంగా రూ.50 కోట్లు పెట్టి అంద‌రూ విస్తుపోయేలా చేశాడు.

ఆ సినిమా ఆ మార్కును అల‌వోక‌గా దాటేసి రాజుకు భారీ లాభాలు తెచ్చిపెట్టింది. ఇప్పుడు ఒక మామూలు సినిమా కోసం నైజాంలో రాజు ఏకంగా రూ.40 కోట్లు పెట్టేస్తున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి. ఆ సినిమా మ‌రేదో కాదు.. భీమ్లా నాయ‌క్. ఇదొక రీమేక్ మూవీ. కథ‌లో అంత భారీత‌నం ఏమీ ఉండ‌దు. ఇద్ద‌రు వ్య‌క్తుల ఇగో క్లాష్ చుట్టూ న‌డిచే క‌థ ఇది. ప‌వ‌న్ క‌ళ్యాణే ఈ సినిమాకు అతి పెద్ద ఆక‌ర్ష‌ణ‌. ఆయ‌న్ని న‌మ్ముకునే దిల్ రాజు నైజాం హ‌క్కుల కోసం ఏకంగా రూ.40 కోట్లు పెట్టేస్తున్న‌ట్లు స‌మాచారం.

బాహుబ‌లి, ఆర్ఆర్ఆర్ కాకుండా మ‌రే చిత్రానికీ నైజాంలో రూ.40 కోట్ల రేటు ప‌లక‌లేద‌న్న‌ది ట్రేడ్ వ‌ర్గాల మాట‌. అందులోనూ క‌రోనా వ‌ల్ల మార్కెట్ ఇంకా దెబ్బ తిన్న నేప‌థ్యంలో భీమ్లా నాయ‌క్ లాంటి సినిమా మీద రూ.40 కోట్లు పెట్ట‌డం అంటే సాహ‌స‌మే. ఐతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ బాక్సాఫీస్ స్టామినా ఏంటో రాజుకు బాగానే గురి ఉండ‌టం, భీమ్లా నాయ‌క్ ప్రోమోలు ప్రేక్ష‌కుల్లో అంచ‌నాలు పెంచి, సినిమాకు మంచి హైప్ రావ‌డంతో రాజు ధైర్యం చేస్తున్నట్లున్నాడు.

సంక్రాంతికైనా, మ‌రో సీజ‌న్లో అయినా భీమ్లా నాయ‌క్ ఎప్పుడొచ్చినా భారీ వ‌సూళ్లే సాధిస్తుంద‌న్న అంచ‌నాతో రాజు రికార్డు రేటు పెట్టేసిన‌ట్లు తెలుస్తోంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ మీద రాజుకు ఎప్పుడూ మంచి అంచ‌నానే ఉంది. ఆయ‌న సినిమాలు వేటికైనా అంత‌కుముందు చిత్రాల‌కంటే ఎక్కువ రేటే పెట్టి హ‌క్కులు తీసుకుంటుంటాడు. మ‌రి భీమ్లా నాయ‌క్ విష‌యంలో ఆయ‌న న‌మ్మ‌కం ఏమేర ఫ‌లిస్తుందో చూడాలి.