అల్లు హీరో ఏం చేయబోతున్నాడు?

అల్లు శిరీష్ అందరికీ షాకిచ్చాడు. కొద్ది రోజుల పాటు సోషల్ మీడియాకి దూరంగా ఉంటున్నట్టు ప్రకటించాడు. నిజానికి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటాడు శిరీష్. ఫొటోలు పెడుతుంటాడు. చాలా విషయాలపై స్పందిస్తుంటాడు. ఫ్యాన్స్‌ అవసరాలను తెలుసుకుని హెల్ప్ చేస్తుంటాడు కూడా. అలాంటిది తను సోషల్ మీడియాకి దూరం కావడమేంటా అంటూ అందరూ ఆశ్చర్యపోయారు.

అయితే ఈ ప్రకటనతో పాటు మరో విషయం కూడా బైటపెట్టాడు శిరీష్. ఈ దూరానికి కారణం ఏంటో తనే బైట పెట్టేశాడు. ‘ఈ యేడు నవంబర్ 11 నాకు చాలా ప్రత్యేకమైనది. నా కెరీర్‌‌లో ఇది మర్చిపోలేని రోజు. ఎందుకో నేను త్వరలోనే చెప్తాను. అంతవరకు కొన్ని కారణాల వల్ల సోషల్ మీడియాకి దూరంగా ఉంటాను’ అని ట్వీట్ చేశాడు. అలా చెప్పి వదిలేస్తే అభిమానులు ఊరుకుంటారా? కారణం చెప్పమని గుచ్చి గుచ్చి అడిగారు.

అన్నింటికీ సమాధానం చెప్పకపోయినా కొందరి ప్రశ్నలకి మాత్రం రెస్పాండ్ అయ్యాడు శిరీష్. పెళ్లి కుదిరిందా అంటే కాదు, కెరీర్‌‌ రిలేటెడ్ అని క్లారిటీ ఇచ్చాడు. బాలీవుడ్‌కి వెళ్తున్నావా అంటే అలాంటి కోరికలేమీ లేవు, కొత్త సినిమా ఫిక్సయ్యిందంటూ హింట్ ఇచ్చాడు. కెరీర్‌‌లో ఇదే బెస్ట్ స్క్రిప్ట్ అని కూడా చెప్పాడు. ఆ పనుల కోసమే బ్రేక్ తీసుకుంటున్నాడన్నమాట.

కెరీర్‌‌లో మంచి మలుపు కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నాడు శిరీష్. ఓ మంచి హిట్ తన ఖాతాలో పడకపోతుందా అని తనవంతు ప్రయత్నాలు చేస్తూ వస్తున్నాడు. కానీ ఇంతవరకు అది జరగలేదు. ప్రస్తుతం అను ఇమ్మాన్యుయేల్‌తో కలిసి ‘ప్రేమ కాదంట’ అనే సినిమా చేస్తున్నాడు. అది తప్ప తన చేతిలో మరే ప్రాజెక్టులూ లేవు. ఇప్పుడు కెరీర్‌‌ టర్న్ అయ్యే కథ దొరికింది అంటున్నాడంటే ఏదో పెద్ద స్కెచ్చే వేశాడనిపిస్తోంది. అదేంటో.. ఎప్పటికి రివీల్ చేస్తాడో.