జ‌గ‌న్ కోపం.. భ‌యంగా మారుతోందా?

ఆంధ్రప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రికి అమ‌రావ‌తి అంటే ఎంత కోప‌మో అంద‌రికీ తెలుసు. గ‌త తెలుగుదేశం ప్ర‌భుత్వం ఏరికోరి రాజ‌ధానిగా ఎంచుకున్న ఈ ప్రాంతాన్ని క‌క్ష‌గ‌ట్టి దెబ్బ కొట్టార‌నే అభిప్రాయం అంద‌రిలోనూ ఉంది. ముందు నుంచి రాజ‌ధానిగా అమ‌రావ‌తిని వ్య‌తిరేకించినా స‌రేలే అనుకోవ‌చ్చు. కానీ రాజ‌ధానిగా ఆ ప్రాంతానికి మ‌ద్ద‌తునిచ్చి, తాను అధికారంలోకి వ‌చ్చాక కూడా అమ‌రావ‌తే రాజ‌ధానిగా ఉంటుంద‌ని న‌మ్మ‌బ‌లికి.. ఎన్నిక‌ల్లో గెలిచి ముఖ్య‌మంత్రి పీఠాన్ని అధిష్ఠించ‌గానే స్వ‌రం మార్చేశారు వైకాపా అధినేత‌. మూడు రాజ‌ధానుల ప్ర‌తిపాద‌నను తెర‌పైకి తెచ్చి అమ‌రావ‌తిని దెబ్బ కొట్ట‌డానికి గ‌త రెండేళ్లుగా ఏం చేయాలో అంతా చేశారు ఏపీ సీఎం.

ఐతే ఇన్నాళ్లూ అమ‌రావ‌తి విష‌యంలో జ‌గ‌న్ కోపాన్ని మాత్ర‌మే చూశాం. కానీ ఇప్పుడు ఆయ‌న‌కు అమ‌రావ‌తి అంటే భ‌యం కూడా బాగానే ఉన్న‌ట్లుగా స్ప‌ష్ట‌మ‌వుతోంది.

న్యాయ‌స్థానం టు దేవ‌స్థానం పేరుతో అమ‌రావ‌తి రైతులు త‌మ ప్రాంతం నుంచి తిరుమ‌లకు పాద‌యాత్ర చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అమ‌రావ‌తికి రాష్ట్ర ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు ఎంత‌మాత్రం లేద‌ని వైకాపా నేత‌లు ముందు నుంచి బ‌ల్ల‌గుద్ది వాదిస్తున్నారు. అలాంట‌పుడు ఈ పాదయాత్ర‌ను ప‌ట్టించుకోకుండా వ‌దిలేస్తే.. నిజంగా జ‌నం అమ‌రావ‌తికి ఏమేర మ‌ద్ద‌తు ఇస్తున్నారో తేలిపోయేది.

పాద‌యాత్ర‌కు స‌రైన స్పంద‌న లేక‌పోతే.. చూశారా మీ అమ‌రావ‌తికి ఉన్న మ‌ద్ద‌తు ఏపాటిదో అని చెప్ప‌డానికి వీలుండేది. కానీ ఈ పాద‌యాత్ర‌కు అనుమ‌తులివ్వ‌క‌పోవ‌డం, ఆ త‌ర్వాత ప‌రిమితులు విధించ‌డం.. ఎక్క‌డిక్క‌డ యాత్ర‌కు అడ్డంకులు సృష్టించ‌డానికి ప్ర‌య‌త్నించ‌డం చూస్తుంటే అమ‌రావ‌తి విష‌యంలో జ‌గ‌న్ భ‌యం ఏ స్థాయిలో ఉందో జ‌నాల‌కు అర్థ‌మైపోతోంది. పాద‌యాత్ర‌కు దారి మ‌ధ్య‌లో ఏ గ్రామం నుంచీ జ‌నాలు మ‌ద్ద‌తు ఇవ్వ‌కుండా.. పోలీసులు పెద్ద ఎత్తున మోహ‌రించ‌డం.. మీడియాను కూడా క‌వ‌రేజీకి దూరం పెట్టే ప్ర‌య‌త్నం చూస్తుంటే.. అమ‌రావ‌తి విష‌యంలో జ‌గ‌న్ స‌ర్కారు ఆందోళ‌న చెందుతున్న‌ట్లుగా క‌నిపిస్తుంది.

ఇలా అడ్డంకులు సృష్టించ‌డం, పాద‌యాత్ర చేస్తున్న వారిపై దాడులు చేయ‌డం లాంటి చ‌ర్య‌ల వ‌ల్ల అమ‌రావ‌తి రైతుల ప‌ట్ల జ‌నాలు సానుభూతి పెరిగి జ‌గ‌న్ స‌ర్కారు చేసిన దుష్ప్ర‌చారం అర్థ‌మైపోతుందేమో అన్న సందేహాలు రాజ‌కీయ విశ్లేష‌కులు వ్య‌క్తం చేస్తున్నారు.