ఆ పాక్ క్రికెటర్‌పై ఓ రేంజ్ ట్రోలింగ్

లేక లేక ప్రపంచకప్‌లో ఇండియా మీద ఒక మ్యాచ్ గెలిచేసింది పాకిస్థాన్. వన్డేలు, టీ20ల్లో కలిపి ఏకంగా 11 మ్యాచుల్లో ఓడాక.. ప్రస్తుతం యూఏఈలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో ఇండియాపై గెలిచింది పాక్ జట్టు. అరుదుగా దక్కిన విజయం కదా. పాకిస్థానీయులు ఆనందాన్ని తట్టుకోలేకపోయారు. సోషల్ మీడియాలో ఎంత అతి చేయాలో అంతా చేశారు. భారత జట్టును, ఆటగాళ్లను విపరీతంగా ట్రోల్ చేశారు. ఆ దేశ మంత్రే ఇది ఇస్లాం విజయం అంటూ కామెంట్ చేశాడు. ఇక పాకిస్థాన్ క్రికెట్లో దిగ్గజ ఆటగాడైన వకార్ యూనస్ ఏమో.. హిందువులైన భారత ఆటగాళ్ల ముందు పాకిస్థాన్ ప్లేయర్లు నమాజ్ చేయడం తనకు నచ్చిందన్నాడు.

ఇవన్నీ ఒకెత్తయితే.. ఆ మ్యాచ్‌లో మూడు వికెట్లు తీసి పాక్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఫాస్ట్ బౌలర్ షహీన్ షా చేసిన అతి ఇంకో ఎత్తు. స్కాట్లాండ్‌తో పాకిస్థాన్ మ్యాచ్ సందర్భంగా తమ దేశ అభిమానులు స్టాండ్స్ నుంచి కోహ్లి, రోహిత్, రాహుల్ అని భారత ఆటగాళ్ల పేర్లు చెబుతుంటే.. వాళ్లు తన బౌలింగ్‌లో ఎలా ఔటయ్యారో చూపిస్తూ వెకిలి చేష్టలు చేశాడు షహీన్. ఈ దృశ్యాలు భారత అభిమానులకు ఒళ్లు మండేలా చేశాయి. ఐతే గురువారం రాత్రి ఆస్ట్రేలియాతో సెమీఫైనల్లో ఏం జరిగిందో అందరూ చూశారు. షహీన్ బౌలింగ్‌లో వరుసగా మూడు బంతుల్లో మూడు సిక్సర్లు బాదిన మాథ్యూ వేడ్ ఆస్ట్రేలియాకు సంచలన విజయాన్నందించాడు. దీంతో పాక్ అభిమానులు బాధ అంతా ఇంతా కాదు.

ఈ ఫలితం భారత అభిమానులు ఎంత ఆనందాన్నిచ్చిందో చెప్పేదేముంది? పాకిస్థానీలు చేసిన అతికి బదులుగా మన వాళ్లు సంబరాలు చేశారు. మళ్లీ ఇంకో దీపావళి వచ్చినట్లుగా ఆ సంబరాలు జరిగాయి. కాగా షహీన్ భారత బ్యాట్స్‌మెన్‌ను గేలి చేస్తున్న వీడియోలో దృశ్యాలకు ఇప్పుడు అతడి బౌలింగ్‌లో వేడ్ బాదిన మూడు సిక్సర్ల వీడియో దృశ్యాలను జోడించి ఇండియన్ ఫ్యాన్స్ ఓ రేంజిలో అతణ్ని ట్రోల్ చేస్తున్నారు. కర్మ సిద్ధాంతాన్ని గుర్తు చేస్తూ షహీన్‌ను మన వాళ్లు ఒక రేంజిలో ఆడుకుంటున్నారు సోషల్ మీడియాలో.