ఇద్దరు సీఎంలదీ ఒకే మాట

ఏ విషయంలో కలిసినా కలవకపోయినా కేసీయార్, జగన్మోహన్ రెడ్డి ఓ విషయంలో మాత్రం కలిసిపోయారు. అదేమిటంటే పెట్రోలు, డీజల్ ధరలను తగ్గింపు విషయంలో. పెట్రోలు, డీజిల్ ధరలను తమ రాష్ట్రాల్లో తగ్గించేది లేదని ఇద్దరు స్పష్టంగా చెప్పేశారు. తెలంగాణాలో ధరలను తగ్గించేది లేదని స్వయంగా కేసీయారే చెప్పగా, ఏపిలో కూడా ధరలు తగ్గింపు సాధ్యంకాదని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ద్వారా జగన్ చెప్పించారు. సరే జగన్ స్వయంగా చెప్పినా మంత్రితో చెప్పించినా విషయం ఏమిటంటే ధరలు తగ్గించేది లేదనే.

పెట్రోలు, డీజల్ ధరలను కేంద్ర ప్రభుత్వం లీటరుకు రు. 5, 10 రూపాయలను తగ్గించిన విషయం తెలిసిందే. ధరలను తగ్గించిన కేంద్రం ఇదే దామాషాలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తగ్గించాలని ఉచిత సలహా పడేసింది. దాంతో వివిధ రాష్ట్రాల్లోని బీజేపీ నేతలు రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిళ్ళు మొదలుపెట్టారు. వీళ్ళకు వత్తాసుగా ఇతర ప్రతి పక్షాల నేతలు కూడా జతకలిశారు. ఇందులో భాగంగానే తెలుగురాష్ట్రాల్లో టీడీపీ, బీజేపీ, జనసేన, వామపక్షాల నేతలు ఏకమయ్యారు. ధరల తగ్గించాలంటు నానా గోల చేస్తున్నారు.

ఇదే విషయమై రెండు ప్రభుత్వాలు కూడా ధరలను తగ్గించేది లేదని స్పష్టంగా ప్రకటించేశాయి. కేంద్రం పెంచిన ధరల్లో తగ్గించింది చాలా స్వల్పమని కాబట్టి కొంతకాలంగా పెంచుకుంటు పోయిన ధరలు మొత్తాన్ని తగ్గించాల్సిందే అంటు డిమాండ్ చేస్తున్నాయి. పైగా సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ ద్వారా వచ్చే ఆదాయంలో మాత్రమే కేంద్రం రాష్ట్రాల వాటాను పంచుతోందన్నారు. రాష్ట్రాలకు వాటా పంచకుండా ఉండేందుకు సెస్ అని సర్చార్జి అని రకరకాల పేర్లతో చేస్తున్న వసూలులో ఒక్క రూపాయి కూడా రాష్ట్రాలకు పంచటం లేదని స్పష్టంచేశారు.

గడిచిన ఏడేళ్ళల్లో సెంట్రల్ ఎక్సైజ్ పన్ను రూపంలో కాకుండా రకరకాల రూపాల్లో కేంద్రం లక్షల కోట్ల వసూళ్లు చేసినట్లు లెక్కలతో సహా చెప్పారు. దాన్ని బీజేపీ నేతలు సహించలేకపోతున్నారు. ఇదే విషయమై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రానికి ఇపుడు వస్తున్న ఏకైక ఆదాయం ఇంధన ధరల మీద పన్నులు మాత్రమే అన్నారు. కాబట్టి ధరలను తగ్గించేది లేదని కూడా ప్రకటించారు. కరోనా వైరస్ నేపధ్యంలో ఈ ఆదాయాన్ని కోల్పోవటానికి రాష్ట్రప్రభుత్వం సిద్ధంగా లేదన్నారు. ధరల తగ్గింపులో కేంద్రానికి ఉన్న అనేక వెసులుబాట్లు రాష్ట్రాలకు లేవన్న విషయాన్ని కూడా బుగ్గన చెప్పారు.

ధరల తగ్గింపు విషయమై టీడీపీ నేత పట్టాభి మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం వెంటనే ధరలు తగ్గించాల్సిందే అని డిమాండ్ చేశారు.