ఆ సినిమాకు ప్రేక్షకులదే ప్రమోషన్

థియేటర్లలో వచ్చినా.. ఓటీటీలో రిలీజ్ చేసినా.. ఈ రోజుల్లో ఓ సినిమాకు ప్రమోషన్ చాలా చాలా అవసరం. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో.. అలాగే సోషల్ మీడియాలో.. ఇంకా బయట ప్రమోషనల్ ఈవెంట్ల ద్వారా కోట్లు ఖర్చు పెట్టి సినిమాను జనాల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తుంటారు. ఓటీటీ సినిమాలను కూడా పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తుండటం గమనించవచ్చు. ఇలాంటి సమయంలో ఓ కొత్త సినిమాను దాని మేకర్స్ పెద్దగా ప్రమోట్ చేయాల్సిన అవసరమే పడట్లేదు. నిజాయితీగా ఒక మంచి ప్రయత్నం చేశారు. ఆ సినిమా ప్రేక్షకులకు తెగ నచ్చేసింది.

సినిమా చూసి కదిలిపోయిన ఆడియన్స్.. దాన్ని నెత్తిన పెట్టుకుని తామే దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఒక్కొక్కరు పది మందికి చెప్పి ఆ సినిమా చూపిస్తున్నారు. ఆ చిత్రానికి అపూర్వ ఆదరణ దక్కేలా చూస్తున్నారు. ఈ ఉపోద్ఘాతమంతా సూర్య సినిమా ‘జై భీమ్’ గురించే అని ఈపాటికే అర్థమైపోయి ఉంటుంది.

నవంబరు 2న ఓ మోస్తరు అంచనాలతో విడుదలైంది ‘జై భీమ్’. ఈ టైటిల్, దీని ప్రోమోలు చూసి మరీ సీరియస్, ట్రాజిక్ మూవీలా ఉందనుకుని చాలామంది దీనికి దూరంగా ఉన్నారు. కానీ సీరియస్ ఇష్యూనే చాలా హృద్యంగా, ఎంతో ఆసక్తికరంగా చెప్పడం.. చూసిన ప్రతి ప్రేక్షకుడినీ ఈ సినిమా కదిలించేయడం.. ఆలోచనలో పడేయడంతో ఈ సినిమాను వీలైనంత ఎక్కువమందికి చూపించాలనే ఫీలింగ్ ప్రేక్షకులకు కలుగుతోంది. మౌత్ పబ్లిసిటీ బాగా ఉపయోగపడి అమేజాన్‌లో ఈ సినిమాను తెగ చూసేస్తున్నారు.

ట్విట్టర్, ఫేస్ బుక్, ఇంకా వివిధ సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగతంగా ఎవరి స్థాయిలో వారు ఈ సినిమాపై అభిప్రాయాలు పంచుకుంటున్నారు. ఒక్కొక్కరి స్పందన గొప్పగా ఉండటంతో కచ్చితంగా ఈ సినిమా చూడాలనే భావన అందరిలోనూ కలుగుతోంది. మొత్తంగా దీపావళికి థియేటర్లలో రిలీజైన వేరే సినిమాలన్నింటినీ వెనక్కి నెట్టి ‘జై భీమ్’యే ప్రేక్షకుల ఫస్ట్ ఛాయిస్ అవుతోంది. ఇదే సామాజిక మాధ్యమాల్లో అతి పెద్ద చర్చనీయాంశంగా మారింది.