‘అఖండ’ నిర్మాత.. అంతకి తగ్గుతాడా..?

బాలకృష్ణ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను రూపొందిస్తోన్న సినిమా ‘అఖండ’. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ను ఇప్పటివరకు ప్రకటించకపోవడానికి ఆంధ్రలో తగ్గించిన టికెట్ రేట్లే కారణమని తెలుస్తోంది. ‘అఖండ’ సినిమా ఆంధ్ర ఏరియా హక్కులు చాలారోజుల క్రితమే అమ్మేశారు. దాదాపు రూ.35 కోట్ల రేషియాలో బేరం కుదిరింది. దీనికి సంబంధించిన అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు.

టికెట్ రేట్లు పెరుగుతాయేమోనని చూశారు. కానీ అలా జరగడం లేదు. ఇప్పుడు సినిమాను రిలీజ్ చేస్తామని అంటుంటే.. బయ్యర్లేమో బేరాలాడుతున్నారు. ముందు చెప్పిన రేటుకి సినిమాను కొనుక్కుంటే వాళ్లకు వర్కవుట్ అవ్వదని.. కనీసం పాతిక నుంచి ముప్పై శాతం తగ్గించమని అడుగుతున్నారు. అంటే రూ.35 కోట్లకు అమ్మాలనుకున్న ఆంధ్ర హక్కులను రూ.28 కోట్ల రేషియోలో అమ్మాల్సి ఉంటుందన్నమాట.

ఆంధ్ర హక్కుల విషయంలో రాజీ పడితే సీడెడ్ లో కూడా తగ్గించమని అడుగుతారు. అంటే ఎలా లేదన్నా.. పది కోట్లకు పైగా ఆదాయం పోగొట్టుకోవాల్సి ఉంటుంది. దీంతో నిర్మాత ఒప్పుకోవడం లేదట. అనుకున్నదానికంటే బడ్జెట్ ఎక్కువ అవ్వడంతో.. థియేట్రికల్ హక్కులను తక్కువకి అమ్ముకుంటే తనకు నష్టం వస్తుందని భావిస్తున్నారు. నాన్ థియేట్రికల్ హక్కులు మంచి రేటుకే పలికినప్పటికీ.. థియేటర్ మీద మరో యాభై కోట్లు వస్తేనే నిర్మాత బయటపడగలరు. ఈ విషయంపై బయ్యర్లతో చర్చలు జరుగుతున్నాయి. వాటిపై ఓ క్లారిటీ వస్తే రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తారు.