బాబు.. గంటాకు మధ్య దూరానికి అసలు కారణం ఇదేనా?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మీద ఆ పార్టీకి చెందిన నేతలు మాత్రమే కాదు కార్యకర్తలు.. అభిమానులు తరచూ ఒక తీవ్రమైన ఆరోపణలు చేస్తారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా ఉండే బాబు.. పవర్ చేజారిన తర్వాత మాత్రం మరోలా మాట్లాడుతుంటారని చెబుతారు. పార్టీ అధికారంలో లేనప్పుడు పార్టీ జెండా పట్టుకున్న వారికే తాను ప్రాధాన్యత ఇస్తానని.. పదవులు ఇస్తానని ఆశ చూపే ఆయన.. అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఎవరెవరికో పదవులు ఇవ్వటాన్ని తప్పు పడుతుంటారు.

2014లో విజయం సాధించిన తర్వాత బాబు ప్రభుత్వంలో చక్రం తిప్పిన పలువురు నేతలు.. పార్టీ ఓటమి పాలైన తర్వాత మాత్రం అడ్రస్ లేకుండా పోవటాన్ని ప్రస్తావిస్తుంటారు. బాబు కుడిభుజంగా వ్యవహరించిన మంత్రి నారాయణ అత్తా పత్తా లేకుండా పోవటం.. బాబు వెన్నెంటే ఉండే సుజనా చౌదరి.. సీఎం రమేశ్ లు బీజేపీలోకి వెళ్లిపోవటం.. పార్టీకి సేవ చేసింది లేకున్నా.. రాజ్యసభకు పంపిన టీజీ వెంకటేశ్ హ్యాండ్ ఇవ్వటం లాంటివెన్నో ఉదాహరణలుగా చూపిస్తారు. ఇక.. మంత్రి పదవితో పాటు.. పార్టీలో ఎక్కువ ప్రాధాన్యత దక్కించుకున్ననేతల్లో గంటా శ్రీనివాసరావు ఒకరు.

2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జగన్ గాలికి తట్టుకొని విజయం సాధించిన అతి కొద్ది మంది నేతలల్లో గంటా శ్రీనివాసరావు ఒకరు. పార్టీ పవర్ లో ఉన్నప్పుడు కీలకంగా వ్యవహరించిన ఆయన.. విపక్షంగా ఉన్న వేళలో మాత్రం పార్టీ గురించి పట్టనట్లుగా ఉండటమే కాదు.. అసలు పార్టీలో ఉన్నారా? లేరా? అన్న చర్చకు తెర తీశారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరతారన్న పేరున్న గంటా.. వైసీపీలోకి వెళతారన్న ప్రచారం జోరుగా సాగుతున్నా.. ఇప్పటివరకు అలాంటిదేమీ జరగలేదు. అదే సమయంలో.. ఆయన టీడీపీ నుంచి వీడిపోయినట్లు ప్రకటించనూ లేదు.

ఇటీవల జరిగిన దాడుల నేపథ్యంలో పార్టీ ప్రధాన కార్యలయంలో 36 గంటల నిరసన దీక్షను చేపట్టిన చంద్రబాబును పార్టీకి చెందిన పలువురు నేతలు సంఘీభావాన్ని ప్రకటించటం.. పార్టీ కార్యాలయానికి రావటం తెలిసిందే. అలాంటిది గంటా మాత్రం నిరసన దీక్షకు బాబుకు మద్దతు తెలపకుండా కామ్ గా ఉండిపోవటంతో.. ఆయన పార్టీకి చెల్లుచీటి ఇచ్చేసినట్లేనన్న మాట బలంగా వినిపిస్తోంది. ఇంతకూ బాబు.. గంటాకు మధ్య దూరానికి కారణం ఏమిటి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

ఇటీవల పలువురు నేతల మధ్య వినిపిస్తున్న మాటల్ని చూసినప్పుడు.. ఈ ఇరువురి మధ్య గ్యాప్ నకు కారణం.. పదవిని ఆశించిన గంటాకు.. ఆయన కోరుకున్నట్లుగా చంద్రబాబు ఓకే చెప్పకపోవటమేనని చెబుతున్నారు. ప్రతికూల వాతావరణంలో గెలిచిన గంటా.. అసెంబ్లీలో పీఏసీ కమిటీ ఛైర్మన్ పదవిని ఆశించినట్లుగా చెబుతారు. అయితే.. ఈ పదవిని సీనియర్ నేత పయ్యావుల కేశవ్ కు అప్పజెప్పిన బాబు తీరుకు గంటా హర్ట్ అయినట్లుగా చెబుతారు. ఈ కారణంతోనే గంటా పార్టీకి దూరంగా ఉండటం మొదలు పెట్టారని చెబుతున్నారు. ఈ దూరం అంతకంతకూ ఎక్కువ కావటమే కాదు.. ఇప్పుడు పూడ్చలేనంత గ్యాప్ వచ్చేసినట్లుగా తెలుస్తోంది.

అసెంబ్లీలో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీకి దూరంగా ఉన్న గంటా.. అధికార పార్టీలో చేరేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేశారని.. అయితే.. సీఎం జగన్ మాత్రం గంటా ఎంట్రీకి ఓకే చెప్పలేదంటారు. ఇదిలాఉంటే.. తాను అనుకున్నట్లుగా ఏపీ అధికారపక్షంలోకి వెళ్లే అవకాశం లేని గంటా.. జనసేనాని వైపు ఆశగా ఎదురుచూస్తున్నట్లుగా తెలుస్తోంది. తన అన్న ప్రజారాజ్యం పార్టీ నాటి నుంచి గంటా గురించి తెలిసిన పవన్.. ఆయన్ను ఇప్పటికిప్పుడు పార్టీలో చేర్చుకోవటం మీద పెద్ద ఆసక్తిని చూపటం లేదంటున్నారు. దీంతో.. అన్ని ఉన్నా.. ఎవరికి కొరగానట్లుగా గంటా ఉండిపోయారని చెబుతున్నారు. మరీ.. పరిస్థితుల్లో మార్పు ఎప్పుడు వస్తుందో చూడాలి.