ఓటీటీకి బాబాయ్, అబ్బాయ్

థియేటర్ ఎక్స్‌పీరియెన్స్, బాక్సాఫీస్ రికార్డుల వంటి విషయాలను పక్కన పెడితే.. ఎంటర్‌‌టైన్‌మెంట్ విషయంలో ఓటీటీలు ఏమాత్రం తీసిపోవడం లేదు. వెరైటీ ఆఫ్ కంటెంట్‌తో ప్రేక్షకుల్ని కట్టి పడేస్తున్నాయవి. అందుకే థియేటర్లు ఓపెన్ అయిన తర్వాత కూడా కొన్ని సినిమాలు డిజిటల్ రిలీజ్‌కే ఫిక్సవుతున్నాయి. ఆ జాబితాలో ఇప్పుడు రెండు మోస్ట్ అవైటెడ్ సినిమాలు చేరబోతున్నట్లు తెలుస్తోంది. ఒకటి దృశ్యం 2, రెండోది విరాటపర్వం.

విరాటపర్వం సినిమా పనులు మొదట్నుంచీ మెల్లగానే సాగుతూ వచ్చాయి. రెండు వేవ్‌లు, లాక్‌డౌన్‌లు ఈ సినిమాకి బాగానే బ్రేకులు వేశాయి. ఇప్పటికింకా ఫినిషింగ్ వర్క్ జరుగుతున్నట్టు సమాచారం. అప్‌డేట్స్‌ కూడా అంతంతమాత్రంగానే బైటికి వస్తున్నాయి. దాంతో మొదట్లో ఓ రేంజ్‌లో ఉన్న ఆసక్తి మెల్లమెల్లగా తగ్గిపోతూ వచ్చింది ప్రేక్షకులకి. ఇప్పుడీ సినిమాని థియేటర్స్‌కి కాకుండా ఓటీటీకి తీసుకెళ్లడమే బెటరని ఫీలవుతున్నారట మేకర్స్. త్వరలో రిలీజ్ డేట్ కూడా ప్రకటించనున్నారట.

మరోవైపు వెంకటేష్, మీనాల ‘దృశ్యం 2’ని కూడా డిజిటల్‌గానే రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీకి మాతృక అయిన మలయాళ వెర్షన్ ఓటీటీలోనే విడుదలై విజయం సాధించింది. ఇప్పుడు రీమేక్‌ కూడా అదే బాటలో నడవడానికి రెడీ అవుతోంది. ఆల్రెడీ నెట్‌ఫ్లిక్స్‌తో అగ్రిమెంట్ కూడా కుదిరినట్లు తెలుస్తోంది. వెంకటేష్ గత చిత్రం ‘నారప్ప’ కూడా ఓటీటీలోనే విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రాన్ని కూడా ఓటీటీలో రిలీజ్ చేస్తారనే వార్తలు ఆయన ఫ్యాన్స్‌కి అంతగా రుచించకపోవచ్చు. పైగా థియేటర్‌‌లో ఎంజాయ్ చేసేందుకు ఫుల్ చాన్సెస్ ఉన్న సినిమా ఇది. అందుకే ఓటీటీకి వెళ్లకపోవడమే బెటర్ అంటున్నవారూ ఉన్నారు.

అయితే సురేష్ బాబు మాత్రం ఈ రెండు సినిమాల్నీ ఓటీటీల్లో మాత్రమే రిలీజ్ చేయాలని ఫిక్సయ్యారట. ఆ విషయాన్ని రీసెంట్‌గా ఆయనే ఓ సందర్భంలో వెలిబుచ్చినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో థియేటర్ల పరిస్థితిపై అసంతృప్తిగా ఉన్న ఆయన డిజిటల్ రిలీజే బెటరని ఫీలవుతున్నారట. ఈ రెండింటినే కాక ఇకపై తన సినిమాలను వీలైనంత వరకు ఓటీటీలకే తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నట్లు కొందరు చెబుతున్నారు. ఏదేమైనా అఫీషియల్ కన్ఫర్మేషన్ వస్తే తప్ప దేన్నీ నమ్మలేం.