దూసుకొచ్చేస్తున్న వారసులు ?

రెండు ప్రధాన పార్టీల్లోని వారసులు రాజకీయాల్లోకి దూసుకొచ్చేస్తున్నారు. బహుశా వచ్చే ఎన్నికల్లో పోటీచేయటమే టార్గెట్ గా వీరిలో చాలామంది రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. దాదాపు 30 నియోజకవర్గాల్లో వారసులదే హవా అన్నట్లుగా సాగుతోంది. ఒకరకంగా చూస్తే వారసుల హవా టీడీపీలోనే ఎక్కువగా కనబడుతోంది. ఎందుకంటే ఇపుడున్న సీనియర్లలో చాలామంది వయసు 70కి వచ్చేసింది.

1982లో పార్టీ పెట్టినపుడు యువకులుగా చేరిన వారు ఇప్పటివరకు రాజకీయాలు చేస్తున్నారు. నిజానికి టీడీపీలో ఇప్పటి సీనియర్లలో చాలామంది పార్టీకి సమస్యగా మారారు. నర్సీపట్నంలో చింతకాయల అయ్యన్నపాత్రుడు కొడుకు విజయ్, పెందుర్తిలో బండారు సత్యనారాయణ కొడుకు ఇప్పటికే కీలకంగా ఉన్నారు. అలాగే పత్తికొండలో కేఈ కృష్ణమూర్తి కొడుకు మారుతి, ఎన్ఎండీ ఫరూక్ కొడుకు చాలా బిజీగా ఉన్నారు. అనంతపురంలో పరిటాల వారసుడు శ్రీరాం ఈసారి పోటీలో ఉంటారు. జేసీల వారసులు పవన్ రెడ్డి, అశ్మిత్ రెడ్డి మొన్నటి ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో హనుమంతరాయచౌదరి కొడుకు పోటీకి రెడీగా ఉన్నారు.

శ్రీకాళహస్తిలో బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కొడుకు సుధీర్ యాక్టివ్ గానే ఉన్నారు. తిరుపతి మాజీ ఎంఎల్ఏ సుగుణమ్మ చిన్నల్లుడు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్నారు. రాజమండ్రి ఎంపీగా మాజీ ఎంపీ మురళీమోహన్ కోడలు రూప పోటీ చేసి ఓడిపోయారు. కనీసం మరో 15 నియోజకవర్గాల్లో సీనియర్ తమ్ముళ్ళ వారసులు రంగప్రవేశం చేశారు. వీరిలో ఎంతమందికి చంద్రబాబు నాయుడు టికెట్లిస్తారో చూడాల్సిందే. ఇదే సమయంలో వైసీపీని తీసుకుంటే ఇక్కడ కూడా కనీసం 15 నియోజకవర్గాల్లో వారసులు యాక్టివ్ గా తిరుగుతున్నారు. ధర్మాన ప్రసాదరావు కొడుకు ధర్మాన రామ్మోహన్ నాయుడు, బొత్సా సత్యనారాయణ కొడుకు డాక్టర్ సందీప్, విజయనగరం ఎంఎల్ఏ కోలగట్ల వీరభద్రస్వామి కూతురు శ్రావణి చురుగ్గా ఉన్నారు.

మంత్రి కొడుకు చెల్లుబోయిన వేణుగోపాలస్వామి కొడుకు నరేన్, రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ కొడుకు పిల్లి సూర్యప్రకాష్ పోటీకి రెడీగా ఉన్నారు. ఎంఎల్సీ తోట త్రిమూర్తులు కొడుకు పృథ్వీరాజ్, తిరుపతి ఎంఎల్ఏ భూమన కరుణాకర్ రెడ్డి కొడుకు అభినయ్ రెడ్డి, చంద్రగిరి ఎంఎల్ఏ చెవిరెడ్డి భాస్కరరెడ్డి కొడుకు మోహిత్ రెడ్డి, శ్రీకాళహస్తి ఎంఎల్ఏ బియ్యపు మధుసూదన్ రెడ్డి కూతురు పవిత్ర రెడ్డి, మంత్రాలయం ఎంఎల్ఏ వై. బాలనాగిరెడ్డి కొడుకు ధరణి రెడ్డి, పాణ్యం ఎంఎల్ఏ కాటసాని రాంభూపాల్ రెడ్డి కొడుకు శివ నరసింహారెడ్డి, ఎమ్మిగనూరు ఎంఎల్ఏ ఎర్రకోట చెన్నకేశవరెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి పోటీకి రెడీ గా ఉన్నారు. చెన్నకేశవరెడ్డి 2014లో పోటీ చేసి ఓడిపోయారు.

వీళ్ళే కాకుండా చాలా మంది సీనియర్ల పిల్లలు రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. వీరిలో కొందరు వచ్చే ఎన్నికల్లో పోటీకి రెడీ అవుతున్నారు. అయితే కొందరు మాత్రం రాజకీయాల్లో చురుగ్గాపాల్గొంటు 2029 ఎన్నికలకు రెడీ అవుతున్నారు. ఏదేమైనా తండ్రి చాటున ఉంటూనే ద్వితీయశ్రేణి నేతలు, కార్యకర్తలతో రెగ్యులర్ గా టచ్ లో ఉంటున్నారు. సరే ఏదేమైనా వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీల నుండి కనీసం 20 నియోజకవర్గాల్లో వారసులే పోటీ చేసే అవకాశాలు కనబడుతున్నాయి. రాజకీయాల్లోకి యవత ఎంట్రీ ఇవ్వటం మంచిదేగా.