నేటి నుంచి అమరావతి రైతుల మహా పాదయాత్ర ప్రారంభం

అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ ఏపీలో గత 685 రోజులుగా రైతులు, మహిళలు, యువత ఉద్యమం చేస్తోన్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ, అమరావతిపై ఏపీ ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేయలేదు. ఈ నేపథ్యంలోనే అమరావతి రాజధాని ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు నేటి నుంచి ‘మహా పాదయాత్ర’ చేపట్టారు. ‘న్యాయస్థానం టు దేవస్థానం’ పేరుతో అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పాదయాత్ర తుళ్లూరు నుంచి తిరుపతి వరకు కొనసాగనుంది.

గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని 70 ప్రధాన గ్రామాల మీదుగా దాదాపు 45 రోజులు సాగే ఈ యాత్ర నవంబరు 1న తుళ్లూరులో మొదలై డిసెంబరు 19న తిరుపతిలో ముగియనుంది. ఈ నేపథ్యంలోనే అమరావతి రైతుల మహాపాద యాత్రకు వైసీపీ మినహా ప్రతిపక్ష పార్టీలన్నీ సంఘీభావం తెలిపాయి. ఈ మహా పాదయాత్రకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంఘీభావం ప్రకటిస్తూ ఉద్యమకారులకు ధైర్యం చెప్పారు.

ఎత్తిన జెండా దించకుండా 685 రోజులుగా ఉద్యమిస్తున్న రైతులకు, మహిళలకు, యువతకు లోకేష్ ఉద్యమాభివందనాలు తెలిపారు. ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని నినాదంతో తలపెట్టిన మహా పాదయాత్ర విజయవంతం కావాలని లోకేష్ ఆంకాంక్షించారు. ఆ శ్రీవారి ఆశీస్సులతో పాలకుల ఆలోచనధోరణిలో మార్పు వచ్చి అమరావతే రాజధానిగా కొనసాగించాలని లోకేష్ అన్నారు. ఉద్యమకారులకు టీడీపీ అండగా ఉంటుందని లోకేష్ అన్నారు.

మరోవైపు, ఈ పాదయాత్రకు టీడీపీ సంపూర్ణ మద్దతుంటుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. మహా పాదయాత్రలో టీడీపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఇన్ని రోజులుగా రైతులు ఉద్యమిస్తున్నా…ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుండడం సిగ్గుచేటన్నారు. ఇక, మహా పాదయాత్ర విజయవంతం కావాలని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ ఆకాంక్షించారు.

అంతకుముందు, రైతులు తలపెట్టిన మహాపాదయాత్రకు ఏపీ డీజీసీ గౌతమ్ సవాంగ్ అనుమతి నిరాకరించారు. దీంతో, ఈ వ్యవహారంపై కొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో యాత్రకు హైకోర్టు అనుమతినిచ్చింది. అయితే, యాత్ర సందర్భంగా సవాంగ్ పలు ఆంక్షలు విధించారు. ముందుగా సమర్పించిన జాబితాలో ఉన్న 157 మందికి మాత్రమే యాత్రలో అనుమతినిచ్చారు. డీజేలు, భారీ స్పీకర్లు, బహిరంగ సభలు పెట్టకూడదని అన్నారు.