అమ‌రావ‌తే గెలిచింది.. రైతుల‌కు హైకోర్టు గ్రీన్ సిగ్న‌ల్‌

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలో ఇప్ప‌టి వ‌ర‌కు వైసీపీ ప్ర‌భుత్వానికి అడుగ‌డుగునా.. అనేక ఎదురు దెబ్బ‌లు త‌గులుతున్నాయి. ఇక్క‌డ భూముల వ్యాపారం జ‌రిగింద‌ని.. ఓ సామాజిక వ‌ర్గానికే మేలు జ‌రిగేలా నిర్ణ‌యం తీసుకున్నార‌ని.. గ‌త టీడీపీ ప్ర‌భుత్వంపై వైసీపీ నేత‌లు తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేసి.. మూడు రాజ‌ధానుల‌కు రెడీ అయ్యారు. అయితే.. ఈ నిర్ణ‌యాల‌ను.. ఆరోప‌ణ‌ల‌ను.. హైకోర్టు నుంచి సుప్రీం కోర్టు వ‌ర‌కు కొట్టేశాయి. తాజాగా.. అమ‌రావ‌తి మ‌రోసారి విజ‌యం ద‌క్కించుకుంది. రాజ‌ధాని రైతుల‌కు హైకోర్టు నుంచి భారీ ఊర‌ట ల‌భించింది.

అమరావతి రైతులు త‌ల‌పెట్టిన మ‌హా పాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. రైతులు నవంబర్‌ 1 నుంచి ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు పాదయాత్ర’ కార్యక్రమాన్ని తలపెట్టారు. మొత్తం నాలుగు జిల్లాలు.. గుంటూరు, ప్ర‌కాశం, నెల్లూరు, చిత్తూరుల్లో రాజ‌దాని గ‌ళం వినిపించి.. శ్రీవారిని ద‌ర్శించుకుని.. ఆయ‌న‌కు మొర‌పెట్టుకునేందుకు రెడీ అయ్యారు. అయితే.. ఈ యాత్ర‌కు రాష్ట్ర ప్ర‌బుత్వం శాంతిభద్రతల పేరుతో మోకాల‌డ్డేందుకు ప్ర‌య‌త్నం చేసింది. శాంతి భ‌ద్ర‌త‌ల‌ను బూచిగా చూపిస్తూ.. పాదయాత్రకు అనుమతి లేదని డీజీపీ ప్రకటించారు.అయితే..దీనిపై అమరావతి అన్న‌దాత‌ల జేఏసీ.. హైకోర్టును ఆశ్రయించింది. విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం.. రైతుల మహా పాదయాత్రకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

పాద‌యాత్ర‌కు ఎలాగూ ప్ర‌భుత్వం అనుమ‌తి ఇవ్వ‌ద‌ని ముందుగానేఊహించిన రైతులు.. గ‌తంలోనే హైకోర్టును ఆశ్ర‌యించారు. అయితే.. పోలీసులు అనుమ‌తులు ఇవ్వ‌క‌పోతే.. కోర్టుకురావ‌చ్చ‌ని తెలిపింది. దీంతో నేతలు మ‌రోసారి హైకోర్టు ను ఆశ్రయించారు. అమరావతి రైతులు తలపెట్టిన పాదయాత్రకు డీజీపీ గౌతమ్‌ సవాంగ్ అనుమతి నిరాకరించిన నేపథ్యంలో… జేఏసీ నేత‌లు హైకోర్టులో లంచ్‌ మోషన్ పిటిషన్ వేశారు. అమరావతి ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతం చేసేందుకు.. నవంబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 17 వరకు పాదయాత్ర చేపట్టాలని రైతు జేఏసీ, అమరావతి పరిరక్షణ సమితి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాయి. న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు పాదయాత్ర పేరిట కార్యక్రమాన్ని నిర్వహించాలని అనుకున్నారు.

డీజీపీకి మ‌రో దెబ్బ‌!

తాజా హైకోర్టు తీర్పుతో.. డీజీపీ గౌతం స‌వాంగ్‌కు మ‌రో భారీ దెబ్బ‌త‌గిలిన‌ట్టు అయింది. అమరావతి పరిరక్షణ సమితి తలపెట్టిన మహా పాదయాత్ర వల్ల ఘర్షణలు, విద్వేషాలు చెలరేగే అవకాశం ఉందని డీజీపీ గౌతమ్‌ సవాంగ్ అన్నారు. అవాంఛనీయ ఘటనలు, అల్లర్లు, ఇతర సమస్యలు తలెత్తకుండా చూసేందుకు దీనికి అనుమతి నిరాకరిస్తున్నట్లు వెల్లడించారు. దరఖాస్తుదారైన అమరావతి పరిరక్షణ సమితి కార్యదర్శి గద్దె తిరుపతిరావుకు ఈ మేరకు లేఖ రాశారు. పార్టీల పరంగా చీలిపోయిన గ్రామాల మీదుగా ఈ యాత్ర సాగినప్పుడు అక్కడి పరిణామాలు ఘర్షణలకు దారితీయొచ్చని, అప్పుడు శాంతిభద్రతల సమస్య ఏర్పడుతుందని ఆ లేఖలో తెలిపారు. అయితే.. ఈ పోలీసుల వాద‌న‌ను హైకోర్టు తోసిపుచ్చి.. పాద‌యాత్ర‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.