ఓటీటీలకి గుడ్‌ బై

ఎటువంటి పాత్రనైనా అవలీలగా, అద్భుతంగా పోషించి వెర్సటైల్‌ యాక్టర్‌‌గా పేరు గడించిన నవాజుద్దీన్ సిద్దిఖీ.. ఓటీటీల్లోనూ తన హవా కొనసాగించాడు. థియేటర్స్‌కి ప్రత్యామ్నాయంగా వచ్చిన డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌కి ఆయన మోస్ట్ వాంటెడ్ యాక్టర్ అయ్యాడు. అయితే ఇప్పుడో షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. ఇకపై డిజిటల్‌ ప్రాజెక్ట్స్ చేయనని తెగేసి చెప్పాడు.

ఫొటోగ్రాఫ్, రాత్‌ అకేలీ హై, ఘూమ్‌కేతు, సీరియస్ మెన్ లాంటి చిత్రాలతో పాటు ‘శాక్రెడ్ గేమ్స్’ లాంటి వెబ్‌ సిరీసులతోనూ ఓటీటీల్లో సూపర్ సక్సెస్ అయ్యాడు సిద్దిఖీ. అయితే అదంతా ఒకప్పుడు, ఇప్పుడు అంత సీన్ లేదు అంటున్నాడు. ఓటీటీ కంటెంట్‌లో వచ్చిన మార్పు తనని చాలా డిస్టర్బ్ చేసిందని, అందుకే ఇక డిజిటల్ ప్రపంచానికి గుడ్ బై చెప్పేస్తున్నానని అంటున్నాడు.

‘శాక్రెడ్ గేమ్స్ చేస్తున్నప్పుడు చాలా ఎక్సయిటింగ్‌గా అనిపించింది. మంచి కంటెంట్‌కి ఓటీటీలు స్థానం కల్పిస్తున్నాయని, కొత్తవారికి అవకాశాలు ఇస్తున్నాయని ఆనందంగా ఉండేది. కానీ ఇప్పుడు వస్తున్న కంటెంట్ చూస్తుంటే చిరాకేస్తోంది. చెత్త కంటెంట్‌తో డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌ని నింపేస్తున్నారు. పైగా వాటికి సీక్వెల్స్ కూడా తీస్తున్నారు. ఇలాంటి వాటిలో నటించి కొందరు స్టార్స్‌ అయిపోతున్నారు. ఇక ఇక్కడ నాలాంటి వాడికి పనేముంది! దీనికి తోడు ఇదో దందాలా తయారైంది. పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు ఎంటరై వరుస ప్రాజెక్టులు చేస్తామంటూ భారీ ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. దాంతో క్వాంటిటీ క్వాలిటీని చంపేస్తోంది. అందుకే నేనిక ఓటీటీల కోసం పని చేయకూడదని డిసైడ్ చేసుకున్నాను’ అని చెప్పాడు సిద్దిఖీ.

ఆయన అన్నదాంట్లో తప్పేమీ లేదేమో. ఓటీటీల్లో వస్తున్న కంటెంట్ క్వాలిటీ తగ్గిపోయిందంటూ కొద్ది రోజులుగా కామెంట్స్ వినిపిస్తున్నాయి. పైగా బోల్డ్ కంటెంట్‌ కూడా ఎక్కువ కావడంతో ఫ్యామిలీ ఆడియెన్స్ చూడలేని పరిస్థితి వచ్చిందని కొందరు ఆరోపిస్తున్నారు. నవాజ్‌ లాంటి అద్భుతమైన నటుడికి ఈ పరిస్థితి నచ్చకపోవడంలో ఆశ్చర్యం లేదు. గుంపులో గోవిందలా ఉండటం ఇష్టం లేక పక్కకి తప్పుకోవడంలో తప్పూ లేదు.