జ‌ల జ‌గ‌డం.. కేసీఆర్‌కు ఫ‌స్ట్ షాక్‌

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మ‌ధ్య నెల‌కొన్న నీటి వివాదంలో తాజాగా తెలంగాణ ముఖ్య‌మంత్రి ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న‌ పాల‌మూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై స్టే విధించారు. ఇది.. ఇప్ప‌టి వ‌ర‌కు తెలంగాణ దూకుడుగా ఉన్న ప‌రిస్థితికి భారీ షాక్ ఇచ్చిన‌ట్టేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఈ నేప‌థ్యంలో కేసీఆర్ ఏం చేస్తారు? ఏపీతో మ‌రింత క‌య్యానికి కాలు దువ్వుతారా? లేక‌.. స‌ర్దుబాటు ధోర‌ణితో వ్య‌వ‌హ‌రిస్తారా? అనేది ఆస‌క్తిగా మారింది. విష‌యం ఏంటంటే.. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోత‌ల ప‌థ‌కంపై చెన్నైలోని జాతీయ హ‌రిత ట్రైబ్యున‌ల్ బెంచ్ తాజాగా స్టే విధించింది.

పర్యావరణ అనుమతులు లేకుండా పనులు చేయవద్దని ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్‌ అభ్యంతరాలను చెన్నైఎన్జీటీ పరిగణనలోకి తీసుకుంది. తెలంగాణ ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందలేదు. కేంద్ర అటవీ, పర్యావరణశాఖ అనుమతులు తప్పనిసరి అని స్పష్టం చేసిన చెన్నైఎన్జీటీ.. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు పనులు వెంటనే ఆపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ విష‌యం ఇప్పుడు తెలంగాణ‌లో సంచ‌ల‌న టాపిక్‌గా మారింది. తెలంగాణ ప్రభుత్వం అనుమతుల్లేకుండా పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పనులు చేపడుతోందంటూ ఏపీకి చెందిన రైతు చంద్రమౌళీశ్వర రెడ్డి చెన్నై ఎన్జీటీని ఆశ్ర‌యించారు.

అద‌స‌మ‌యంలో ఉదండాపూర్‌ రిజర్వాయర్‌ నిమిత్తం అనుమతుల్లేకుండా మైనింగ్‌ చేపడుతున్నారంటూ మహబూబ్‌నగర్‌కు చెందిన కోస్గి వెంకటయ్య పిటిషన్ దాఖలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం యుద్ధప్రాతి పదికన పనులు చేపడుతున్నందున అత్యవసరంగా విచారణ చేపట్టాలంటూ చంద్రమౌళీ శ్వరరెడ్డి పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది పీఎస్‌.రామన్‌ వాదనలు వినిపిస్తూ తాగునీటి అవసరాల ముసుగులో సాగునీటి ప్రాజెక్టు నిర్మిస్తున్నారని తేలిందన్నారు.

ఈ దశలో తెలంగాణ అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ (ఏఏజీ) జె.రామచంద్రరావు జోక్యం చేసుకుంటూ అభ్యంతరాలను దాఖలు చేస్తామన్నారు. తాగునీటి అవసరాలకే పనులు చేపడుతున్నామంటూ తాము చెప్పినదానికే కట్టుబడి ఉన్నామన్నారు. నివేదిక తప్పుదారి పట్టించేలా ఉందని ఆరోపించారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ ఈ పిటిషన్‌ విచారణ చేపట్టినప్పటి నుంచి మీరు ఉంటున్నారని, కమిటీ ఏర్పాటుకు ఉత్తర్వులిచ్చిన విషయం తెలిసీ, ఇప్పుడు ప్రాథమిక అభ్యంతరాలంటే ఎలా అని ప్రశ్నించింది.

రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో ఒకలా… ఇక్కడ మరోలా అంటున్నారంది. ఆరేళ్లుగా పనులు కొనసాగుతున్నందున పిటిషన్‌ విచారణార్హం కాదని ఏఏజీ వాదించారు. విచారణార్హతపై వాదనలు వినిపించడానికి సిద్ధంగా ఉన్నామని ఏపీ తరఫున ఏజీ శ్రీరాంతోపాటు న్యాయవాది దొంతిరెడ్డి మాధురిరెడ్డి తెలిపారు. తెలంగాణ పిటిషనర్‌ తరఫు న్యాయవాది శ్రవణ్‌కుమార్‌ వాదనలు వినిపిస్తూ నివేదికలో పేర్కొన్న కాలుష్య తీవ్రతను పరిశీలించాలని కోరగా ఏఏజీ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ పిటిషన్‌లోని అంశాలు వేరని ఆయన చెప్పగా… ఎన్జీటీ దీనిపై విచారణ ఇవాళ చేపట్టగా… పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పై చెన్నైఎన్జీటీ స్టే విధించింది.