జ‌డ్జిల‌పై బూతులు.. ఆపై కోర్టుకు అబ‌ద్దాలు.. హైకోర్టు సీరియ‌స్‌..!!

ఏపీలో వైసీపీ ప్ర‌భుత్వం తీసుకున్న కొన్ని నిర్ణ‌యాల‌ను హైకోర్టు తీవ్ర‌స్థాయిలో త‌ప్పుబ‌ట్టింది. గ‌డిచిన రెండున్న‌రేళ్ల పాల‌న‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 177 కేసుల్లో హైకోర్టు నుంచి ఎదురుదెబ్బ త‌గిలింది. అయితే.. ఇలాంటి స‌మస్య‌లు వ‌చ్చిన‌ప్పుడు.. ప్ర‌భుత్వం ఆత్మ ప‌రిశీల‌న చేసుకుని.. ఆయా నిర్ణ‌యాల‌ను వెన‌క్కి తీసుకుని.. స‌రిచేసుకోవ‌డం అనేది ఏ స‌ర్కారుకైనా.. క‌నీస ధ‌ర్మం. కానీ.. ఘ‌న‌త వ‌హించిన వైసీపీ స‌ర్కారు మాత్రం.. ఆ ప‌నిచేయ‌లేదు. పైగా.. వైసీపీ నాయ‌కులు.. గ‌తంలో ఉన్న హైకోర్టు న్యాయ‌మూర్తుల‌ను దూషిస్తూ.. సోష‌ల్ మీడియాలో పోస్టులు పెట్టారు.

వీటిపై కొంద‌రున్యాయ‌వాదులు.. కోర్టుకు వెళ్లారు. దాదాపు ఏడాది నుంచి ఈ కేసులపై హైకోర్టులో విచార‌ణ సాగుతోంది. అదేస‌మ‌యంలో ఈ కేసు విచార‌ణ‌ను రాష్ట్ర సీఐడీ సాగ‌దీయ‌డంతో.. దీనిని సీబీఐకి అప్ప‌గించారు. అయితే.. ఇప్పుడు ఏకంగా.. సీబీఐ కూడా.. కోర్టును త‌ప్పుదోవ ప‌ట్టిస్తోంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. దీంతో హైకోర్టు తాజాగా సీరియ‌స్ అయింది. జ‌డ్జిలపై అనుచిత వ్యాఖ్యల కేసులో మరోసారి హైకోర్టు ఆగ్రహం వ్య‌క్తం చేసింది. దీనికి సంబందించి తాజాగా జ‌రిగిన విచార‌ణ‌లో విశాఖ సీబీఐ ఎస్పీ హైకోర్టుకు హాజ‌ర‌య్యారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌.. జ‌డ్జిల‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన‌.. పంచ్ ప్రభాకర్ అనే వ్య‌క్తి తాలూకు వీడియోలు ఇవ్వాలంటూ.. తాము యూ ట్యూబ్‌కు లేఖ రాశామని చెప్పారు. అయితే.. దీనికి వెంట‌నే కౌంట‌ర్ ఇచ్చిన యూట్యూబ్ త‌ర‌ఫు న్యాయ‌వాదులు.. సీబీఐ ఎలాంటి లేఖ రాలేదని కోర్టుకు వెల్ల‌డించారు. దీంతో హైకోర్టు మ‌రింత సీరియ‌స్ అయింది. ఫేస్‌బుక్‌, వాట్సప్ తరఫున సీనియ‌ర్ మోస్ట్ న్యాయ‌వాదులు.. ముకుల్ రోహత్గి, కపిల్ సిబల్ కోర్టుకు హాజ‌ర‌య్యారు.

ఈ సంద‌ర్భంగా హైకోర్టు జోక్యం చేసుకుని.. రిజిస్ట్రార్ జనరల్ విజ్ఞప్తి చేసిన వెంటనే తొలగించాలన్న స్టాండింగ్ కౌన్సిల్ అశ్వినీకుమార్ ఆదేశాల‌ను ఎందుకు పాటించ‌లేద‌ని ప్ర‌శ్నించింది. పంచ్ ప్రభాకర్‌పై తీసుకున్న చర్యలపై అఫిడవిట్ వేయాలని సీబీఐని ఆదేశించింది. అంతేకాదు.. పంచ్ ప్రభాకర్‌ను ఎవరో(ప్ర‌భుత్వ పెద్ద‌లు) నడిపిస్తున్నారని సందేహం వ్యక్తం చేసింది. ఇదే స‌మ‌యంలో జోక్యం చేసుకున్న యూట్యూబ్ త‌ర‌ఫున న్యాయ‌వాదులు.. అనుచిత పోస్టులపై లేఖ రాస్తే తొలగిస్తామని హామీ ఇచ్చారు. అయితే.. ఈ మొత్తం వ్య‌వ‌హారం వైసీపీ స‌ర్కారుకు మ‌రింత సెగ పెట్టేలా ఉంద‌ని అంటున్నారు న్యాయ‌వాదులు. కోర్టును త‌ప్పుదోవ ప‌ట్టిస్తే.. ఈ కేసు మ‌రింత సీరియ‌స్ అవుతుంద‌ని చెబుతున్నారు.